హుజూరాబాద్ : బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ నిప్పులు చెరిగారు. పాదయాత్ర చేయడం కాదు.. చేతనైతే, దమ్ముంటే దళితబంధుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని బండ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హుజూరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో బండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
కేంద్రం రాష్ట్రానికి, హుజురాబాద్ నియోజకవర్గానికి ఏం మేలు చేసిందో చెప్పాలన్నారు. దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇచ్చారు. ప్రతి దళిత కుటుంబానికి రూ. 50 లక్షలు ఇవ్వాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిజంగా బీజేపీ నాయకులకు దళితులపై ప్రేమ ఉంటే.. కేంద్రం నుంచి రూ. 40 లక్షలు తీసుకురాగలరా? అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయన్నారు. మంత్రి హరీశ్రావును విమర్శించే అర్హత ఈటల రాజేందర్కు లేదన్నారు. బీజేపీ మాటలు నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరు.. అధికారంలోకి వస్తాం అంటూ కలలు కనడం మానుకోవాలన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీకి ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. సీఎం కేసీఆర్, హుజూరాబాద్ ప్రజల ఆశీస్సులతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ అన్నారు.