ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 29: దళిత బంధు పథకాన్ని అడ్డుకునేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని, వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ పిలుపునిచ్చారు. దళిత బంధుపై గురువారం ఉస్మానియావర్సిటీలో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ పథకం దేశంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. స్వాతం త్య్రం సిద్ధించి 73 వసంతాలు గడుస్తున్నా దళితులు అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్నారు. దళితుల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు తదితర కార్యక్రమాలు అమలుచేస్తున్నారని వివరించారు. దళిత బంధు పథకం ద్వారా ఉపాధి పొందడంతోపాటు చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఓయూజేఏసీ చైర్మన్ డాక్టర్ బండారు వీరబాబు, అధ్యక్షుడు డాక్టర్ మంద సురేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు ప్రకాశ్, పెర్క శ్యామ్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గణేశ్, ప్రొఫెసర్ రవినాయక్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, విద్యార్థి నేతలు వల్లమల కృష్ణ, నాగయ్య, అఖిల్, బాలకృష్ణ, ఆవాల హరిబాబు, కాంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.