నిజామాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వానకాలం సీజన్లో పంటల సాగు విస్తీర్ణం మరింత పెరుగనున్నది. గతంతో పోలిస్తే రైతులు తమ పరిధిలోని భూములను సాగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సాగు, కరెం ట్, ఎరువులు, విత్తనాలు, ప్రతికూల అంశాలతో గతంలో పంటలు వేయాలంటే వెనుకా ముందు ఆలోచించేది. ఇప్పు డు రాష్ట్ర ప్రభుత్వం రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తుండడంతో రైతన్నలు సంతోషంగా సాగులో దూసుకుపోతున్నారు. వానకాలం 2020తో పోలిస్తే వ్యవసాయ శాఖ 2021 వానకాలంలో వెల్లడించిన సాగు అంచనాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో యాసంగి మాదిరిగానే వానకాలంలోనూ భారీగా పంటలు సాగుకు నోచుకోనున్నది. ఇందులో ప్రభుత్వం చెబుతున్నట్లుగానే కామారెడ్డి జిల్లాలో భిన్న పంటల సమాహారంతో కనువిందు చేయబోతుండగా.. అధికారుల అలసత్వం, పట్టింపులేనితనం, ప్రణాళిక లోపంతో గతంలో మాదిరిగానే నిజామాబాద్ జిల్లాలో సంప్రదాయ పంటల సాగుకే పెద్దపీట పడబోతున్నది. కామారెడ్డిలో వరి ప్రధానంగా సాగవుతున్నప్పటికీ పత్తి, పప్పు దినుసు పంటల సాగు కాసింత పెరిగే ఆస్కారం ఉన్నట్లు వ్యవసాయాధికారులు వెల్లడిస్తున్నారు.
10లక్షల ఎకరాలు దాటనున్న సాగు విస్తీర్ణం..
రాష్ట్ర సర్కారు అందిస్తున్న ప్రోత్సాహంతో రైతులు జోరు గా… హుషారుగా సాగులోకి అడుగు పెడుతున్నారు. రైతుబంధు నగదు ఇప్పటికే కర్షకుడి చేతికి అందడంతో వారంతా అవసరమైన ఎరువులు, విత్తనాలు తీసుకున్నారు. వానలు సైతం సీజన్ ప్రారంభం నుంచి అదరగొడుతుండడంతో రైతులంతా ధైర్యంగా ముందడుగు వేస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాల మేరకు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో 2021 వానకాలంలో ఏకంగా 10లక్షల ఎకరాలకు పైగానే పంటలు సాగవ్వనున్నట్లుగా తెలుస్తున్నది. రికార్డు స్థాయిలో పంటలు సాగవ్వనుండడంతో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. నిజామాబాద్ జిల్లాలో 2020 వానకాలంలో 4లక్షల 92వేల 152 ఎకరాల్లోనే పంటలు సాగవ్వగా ఈ సారి 5లక్షల 7వేల 800 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయాధికారులు అంచనాలు సిద్ధం చేశారు. కామారెడ్డి జిల్లాలో 2020 వానకాలంలో 4లక్షల 50వేల 578 ఎకరాల్లో పంటలు సాగయ్యా యి. ఈసారి 4లక్షల 98వేల 193 ఎకరాలకు సాగు విస్తీర్ణం పెరగనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. కామారెడ్డి జిల్లాలో వ్యవసాయాధికారుల పకడ్బందీ ప్రణాళికలతో భిన్న పంటల సమాహారంగా సాగు తీరు కనిపిస్తున్నది. నిజామాబాద్లో వ్యవసాయాధికారుల నిర్లక్ష్యంతో మూస పద్ధతిలోనే పంటలు సాగయ్యే అవకాశాలు వ్యవసాయాధికారుల అంచనాల్లో తేటతెల్లం అవుతున్నది.
దళారీ దందాకు చెక్..
పంటల సాగు వివరాలను ప్రభుత్వం త్వరలోనే పూర్తిగా ఆన్లైన్లోకి ఎక్కించాలని ఆదేశాలు జారీ చేయనుంది. రైతులు పండిస్తున్న పంటల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. పంట ఉత్పత్తుల కొనుగోళ్ల సమయం లో దళారుల ప్రవేశం ఏదో రకంగా కనిపిస్తూ ఉంటుంది. క్షేత్ర స్థాయిలో వ్యవసాయాధికారుల ప్రోత్సాహంతో దొంగ పత్రాలను పొంది ప్రభుత్వ మద్దతు ధరను కొల్లగొడుతున్న ఘటనలు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఏటా సాగుతున్నవే. ఈ ఘటనలు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో సాగే కందులు, పెసర్లు, మినుములు, శనగల కొనుగోళ్లలో ఏటా జరిగే తంతు. బయటి రాష్ర్టాల్లో తక్కువ ధరకు పంటలను కొనుగోలు చేసి దొడ్డిదారిన అధిక ధరలకు విక్రయించి గంటల్లోనే దళారులు రూ.లక్షలు సంపాదిస్తున్నారు. తద్వారా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఉత్పత్తి అవుతున్న పంటల దిగుబ డి కంటే ఎక్కువగా కొనుగోళ్లు చేయాల్సిన పరిస్థితి ఏటా ఎదురవుతున్నది. ఒకానొక దశలో బయటి వ్యక్తుల ప్రమేయంతో అసలైన రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి దోపిడీ వ్యవస్థను అంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పంట ల సాగు వివరాల నమోదుకు శ్రీకారం చుట్టింది. ఫీల్డ్ స్థాయి లో ఏఈవోలు ప్రతి రైతూ ఏయే పంటలు సాగు చేస్తున్నారనే సమాచారాన్ని సేకరించి ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. వ్యవసాయ శాఖ త్వరలోనే ఆదేశాలు జారీ చేయనుంది.
ఆన్లైన్ క్రాప్ బుకింగ్..
రైతుబంధు పోర్టల్లో ఆ పథకం వర్తించిన రైతుల వివరాలను ఆధారంగా చేసుకుని ఏఈవోలు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు. రైతులు పంటలు వేసిన సమయానికి అనుగుణంగా ఆ వివరాలను నమోదు చేస్తారు. పొలం గట్ల వెంట, హద్దుల వెంట రైతులు నాటే వివిధ రకాల మొక్కల వివరాలను సైతం ఏఈవోలు సేకరిస్తారు. విత్తనోత్పత్తి కోసం పంటల సాగు, సేంద్రి య పద్ధతుల్లో పంటల సాగు, సాగు నీటి వసతి వివరాలు, నీటి పారుదల, బిందు సేద్యం పద్ధతుల వివరాలను సేకరించనున్నారు. నమోదైన పంటల సాగు వివరాలను సంబంధిత రైతు మొబైల్ ఫోన్కు మెస్సేజ్ సైతం పంపించేలా ఏర్పాటు చేయబోతున్నారు.
రైతు వారీగా పంటల సాగు వివరాలను ఆన్లైన్ చేయడాన్ని క్రాప్ బుకింగ్గా ప్రభుత్వం పిలుస్తుంది. గతంలోనూ ఇదే తరహా ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేశారు. ఈ వానకాలంలో రైతులు సాగు చేసే ప్రతి పంటను ఇందులో నమోదు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇలా సేకరించిన సమాచారాన్ని రైతులు పండించిన వివిధ పంటల కొనుగోళ్లలో లబ్ధిదారులను గుర్తించేందుకు దోహదం చేయనున్నది. ఏఈవోలు గ్రామాలకు వచ్చి రైతులు, గ్రామ ప్రజా ప్రతినిధులు, రైతుబంధు సమితికి సమాచారం ఇచ్చి వారి సహకారంతో వివరాలు సేకరిస్తారు. వ్యవసాయ శాఖలో నిజామాబాద్ జిల్లాలో 106 క్లస్టర్లు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 104 క్లస్టర్లలో ఏఈవోలు పని చేస్తున్నారు.