హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది సంక్లిష్ట గతాలు- భిన్న భవిష్యత్తులు (కాంప్లెక్స్ పాస్ట్- డైవర్స్ ప్యూచర్స్) అనే అంశంపై పర్యాటక దినోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పురాతన స్థలాలు, కట్టడాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వాటి ప్రాముఖ్యతలను రాబోయే తరాలకు చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నదని చెప్పారు. సదస్సులు, వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ వారసత్వ సంపదను స్వచ్ఛదంగా వెలుగులోకి తెస్తున్న 17 మందిని ఈ సందర్భంగా మంత్రి సన్మానించారు.
రామోజు హరగోపాల్, ఎంఏ శ్రీనివాసన్, చోలేజీ శ్రీనివాస్ (హైదరాబాద్), వేముగంటి మురళీకృష్ణ, అహోబిలం కరుణాకర్, కొలిపాక శ్రీనివాస్, సామలేటి మహేశ్ (సిద్దిపేట), బొగ్గుల శంకర్రెడ్డి (మెదక్), బలగం రామ్మోహన్ (బాసర), సముద్రాల సునీల్ (గోదావరిఖని), రాగి మురళి (నల్లగొండ), కట్ట శ్రీనివాస్ (ఖమ్మం), తుమ్మ దేవల్రావు, సంతోష్ దడిగ (నిర్మల్), అరవింద్ ఆర్య పకిడె (వరంగల్), రెడ్డి రత్నాకర్రెడ్డి (జనగాం), ముచ్చర్ల దినకర్రావు (మహబూబ్నగర్).