సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 27 : అక్రమంగా దాచి ఉంచిన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసిన సంఘటన త్రీటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొన్నాల గ్రామం టీహెచ్ఆర్నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. త్రీ టౌన్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బత్తుల మహేశ్ అనే వ్యక్తి ఇంటిలో మద్యం ఉందన్న నమ్మదగిన సమాచారం మేరకు తమ సిబ్బందితో రైడ్ చేసి రూ.9900 విలువ గల 11 రాయల్ స్టాగ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల సమయంలో అక్రమంగా మద్యం సరఫరా చేసినా, ఇండ్లల్లో దాటిపెట్టినా, బెల్ట్షాపులు నిర్వహించినా.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్రీటౌన్ పరిధిలో ఎవరైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు నిర్వహించినట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 గానీ, పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నంబర్ 7901100100 కు సమాచారం అందించాలన్నారు.