నల్లగొండ ప్రతినిధి, మార్చి 16 (నమస్తే తెలంగాణ): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం ముగుస్తున్న తరుణంలో మరో రాజకీయ సందడికి తెరలేచింది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న క్రమంలో మంగళవారం నాగార్జునసాగర్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. గతేడాది డిసెంబర్ 1న ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణం చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక అప్పటి నుంచి అందరి దృష్టి నాగార్జునసాగర్పై పడింది. షెడ్యూల్ విడుదల కాకముందే ఎవరికి వారు తమదైన శైలిలో ఓటర్లలోకి వెళ్తున్నారు. తాజాగా షెడ్యూల్ విడుదలతో రాజకీయ వేడి నెలకొన్నది.
2018డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య 7771 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. నోములకు 83655 ఓట్లు రాగా జానారెడ్డికి 75884 ఓట్లు పోలయ్యాయి. కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు అభ్యర్థి రామకృష్ణారెడ్డి 9819 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. 2675 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు. మొత్తం 208176 మంది ఓటర్లు ఉండగా అందులో 85.98శాతం పోలింగ్తో 184977ఓట్లు పోలయ్యాయి. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రాతినిథ్యం వహించిన జానారెడ్డి కీలక సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. ఇదే అంశం గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల విజయానికి తోడ్పడిందన్న చర్చ ఉంది. ఈ క్రమంలో అభ్యర్థి ఎవరైనా మరోసారి గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులు వ్యూహరచన చేస్తున్నారు. పార్టీ తరఫున క్యాడర్ను కదిలించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంత్రి జగదీశ్రెడ్డితో పాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ ఇక్కడ నిత్యం పర్యటిస్తూ క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు.
అదేవిధంగా పార్టీ అధిష్ఠానం మండలాలు, మున్సిపాలిటీల వారీగా పలువురు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. వీరంతా ఇప్పటికే రంగంలోకి దిగి గ్రామాల వారీగా టీఆర్ఎస్ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని మరోసారి భారీ మెజార్టీతో నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి మరోసారి జానారెడ్డి బరిలో దిగుతున్నారు. నెల రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు. పార్టీ ముఖ్యులతో పాటు క్యాడర్తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఇద్దరు కుమారులు రఘువీర్రెడ్డి, జయవీర్రెడ్డి కూడా నియోజకవర్గంలోని ముఖ్యులను కలుస్తున్నారు. మరోసారి గెలిపించాలని కోరుతూ ప్రజలను కోరుతున్నారు. ఇక బీజేపీ నుంచి ఇద్దరు అభ్యర్థులు టికెట్ ఆశిస్తూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రస్తుత బీజేపీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్రెడ్డి సతీమణి నివేదితారెడ్డి కేవలం 2675ఓట్లను మాత్రమే సాధించి నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సారి కూడా టికెట్ తమకే అంటూ శ్రీధర్రెడ్డి దంపతులు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, పార్టీలో అంతర్గత గ్రూపుల కారణంగా శ్రీధర్రెడ్డి దంపతులకు వ్యతిరేకంగా సీనియర్లు కడారి అంజయ్యయాదవ్ను తెరపైకి తెచ్చారు. దీంతో ఆయన తన రోజువారీ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్రావు, మరో నేత చాడ సురేశ్రెడ్డి ఎన్నికల సమన్వయకర్తలుగా నియమితులయ్యారు. బీజేపీ గెలవడానికి ఏ మాత్రం అవకాశాలు లేకపోయినా ఓట్ల శాతం పెంచుకోవాలన్న పట్టుదల కనిపిస్తున్నది. వీరితో పాటు ఇంకా పలువురు అభ్యర్థులు కూడా రంగంలోకి దిగే సూచనలున్నాయి. రాష్ట్రంలో జరుగనున్న ఏకైక ఉప ఎన్నిక కావడంతో అందరి దృష్టి ఇక్కడే ఉన్నది.