హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు తక్కువ ధరకే మిల్లింగ్ యంత్రాలు అందించేందుకు జపాన్ కంపెనీ సటాకె ముందుకొచ్చింది. ఆయా జోన్లలోనే వర్కర్లకు శిక్షణ ఇవ్వడంతో పాటు 24 గంటల సర్వీసింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపింది. సంస్థ ప్రతినిధులు సోమవారం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ను కలిసి ఈ మేరకు ప్రతిపాదనలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… సటాకే యంత్రాల ద్వారా గంటకు 21 టన్నుల సామర్థ్యంతో ప్రతిరోజు 500 టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయొచ్చని తెలిపారు. సటాకే సంస్థ ప్రతి పాదనలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. తుది నిర్ణయం తీసుకొంటామని తెలిపారు. ఇక మంత్రి కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలోకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో సటాకే కంపెనీ డైరెక్టర్ రాజేందర్ కే బజాజ్, ఏజేఎం సతీశ్కుమార్, ప్రతినిధులు విఠల్, వినయ్ పాల్గొన్నారు.