రవీంద్రభారతి, ఆగస్టు 8: బహుజన రాజ్యం కోసం నిజాం పాలకుల నిరంకుశత్వా నికి వ్యతిరేకంగా భూస్వాములతో కొట్లాడిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఆదివారం జైగౌడ్ ఉద్యమ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్నగౌడ్ 371వ జయంతి వేడుకలు రవీంద్రభారతిలో జరిగాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణతోపాటు, ఏపీ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు రాష్ర్టాల నుంచి గౌడ ప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ కుల వృత్తులపై విధిస్తున్న పన్నులను నిరసిస్తూ ఏకతాటిపైకి తెచ్చి వారికి విముక్తి కలిగించిన ధైర్య సాహసి సర్వాయి పాపన్నగౌడ్ అని పేర్కొన్నారు. పెత్తందారులు పాపన్నగౌడ్ను దోపిడీ దొంగగా చిత్రించి, చరిత్రను వక్రీకరించారని మండిపడ్డారు. ఆయన చరిత్రను విదేశీ యూనివర్సిటీల్లో పుస్తకాల్లో రాశారని.. ఉమ్మడి ఏపీలో మాత్రం పాలకులకు తెలియలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గౌడల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కల్లు అంటే తక్కువ జాతివారు తాగే పానీయంగా గత పాలకులు చిత్రీకరించారని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నీరా అమ్మకానికి ప్రత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేశార ని చెప్పారు. హైదరాబాద్లో పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్చే త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. జైగౌడ్ జాతీయ అధ్యక్షుడు రామారావుగౌడ్ దేశవ్యాప్తంగా తిరుగుతూ గౌడ జాతిని ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, ఏపీ ఎంపీ భరత్రామ్గౌడ్, మాజీఎంపీ మధుయాష్కీ, తూళ్ల వీరేందర్గౌడ్, పల్లె లక్ష్మణ్గౌడ్, జైగౌడ్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.