ములుగు: వనదేవతలు కొలువై ఉన్న మేడారం ఆలయం పునఃప్రారంభమయ్యింది. ఆలయ సిబ్బందికి కరోనా సోకడంతో ఈనెల 1న ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గిరిజనులు ఆరాధ్య దైవంగా కొలిచే సమ్మక్క-సారలమ్మ చిన్న జాతర ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు నాలుగు రోజులపాటు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. బెల్లం, చీరసారె, పూలుపండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అయితే ఉత్సవాల సందర్భంగా నలుగురు ఆలయ ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. దీంతో ఆలయాన్ని 21 రోజులపాటు మూసివేయాలని అధికారులు గత నెల 28న నిర్ణయించారు. ఈనేపథ్యంలో మార్చి 1న ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మళ్లీ నేటి నుంచి భక్తులు అమ్మవార్లను దర్శించుకోవచ్చు.