ప్రభుత్వోద్యోగులతోపాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకూ రాష్ట్ర ప్రభుత్వం సంబురాన్ని తెచ్చింది. వారి గౌరవ వేతనాలను ఏకంగా 30% పెంచింది. వీరితోపాటు గౌరవ వేతనాన్ని అందుకొనే హోంగార్డులు, అంగన్వాడీ, వీఆర్ఏ, వీఏఓ, ఆశావర్కర్లకు కూడా 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు సంబురాన్ని తెచ్చింది. గౌరవ వేతనాలను ఏకంగా 30% పెంచింది. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే 30 శాతం ఫిట్మెంట్తో తీపి కబురు చెప్పింది. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 30శాతం పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలో 12 మంది స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు సమావేశాలు నిర్వహించి స్థానిక ప్రజాప్రతినిధులకు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనం పెంచాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు విజ్ఞప్తిచేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సమానంగా 30 శాతం వేతనాలను పెంచటం విశేషం. వేతన పెంపు నిర్ణయం, ఉత్తర్వులజారీపై ఎమ్మెల్సీ కవిత సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. స్వరాష్ట్రంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల గౌరవ వేతనాలు పెరగడం ఇది మూడోసారి.
ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకోలేదు
ఉమ్మడి రాష్ట్రంలో స్థానికసంస్థల ప్రజాప్రతినిధులను ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. స్థానిక సంస్థల ప్రతినిధులు తమ గోడు వినిపించేందుకు జిల్లా స్థాయిల్లో ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేసినా వారి గౌరవ వేతనం రూ.వందల్లోనే ఉండేది. స్వరాష్ట్రం సాధించుకున్న తరువాత స్థానిక ప్రజాప్రతినిధుల వేతనం రూ.వేలకు చేరింది. తాజా పెంపుతో రాష్ట్రంలోని 18 వేల మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు లబ్ధి చేకూరుతుంది. సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యుల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి 6,500, జడ్పీటీసీ సభ్యుల గౌరవ వేతనం రూ.10 వేల నుంచి 13 వేలకు పెంచారు. ఎంపీపీలకు ప్రస్తుతం రూ.10 వేలు ఇస్తున్నారు. జడ్పీ చైర్మన్లకు రూ.లక్ష గౌరవ వేతనం అందిస్తున్నారు. వీరికి కూడా గౌరవ వేతనాలు పెరిగే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు.
హోంగార్డులు, అంగన్వాడీలకూ పెంపు
రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న అన్ని వర్గాల ఉద్యోగులకు 30 శాతం వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీలో చేసిన ప్రకటన మేరకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతోపాటు గౌరవ వేతనం అందుకొంటున్న చిరుద్యోగులందరికీ వేతనాలు పెంచారు. గౌరవ వేతనం అందుకుంటున్న హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, అంగన్వాడీ అసిస్టెంట్లు, విలేజి రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏ).. విలేజి ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (వీఓఏ), ఆశ వర్కర్లు, సెర్ప్ ఉద్యోగులకు 30 శాతం గౌరవ వేతనాలు పెంచింది. ఈ మేరకు ఆయా శాఖలు పెంచిన వేతనాలను అమలుచేయాలని మంగళవారం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
‘స్థానిక’ సంస్థల బలోపేతానికి ఊతం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్ని బలోపేతానికి ఊతం ఇచ్చినట్టు అయిందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ల గౌరవవేతాన్ని 30శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీచేయడంపై ఆమె హర్షం వ్యక్తంచేశారు. స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమస్యలు, నిధులు, విధుల వంటి అంశాలపై 12 మంది స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పలు సమావేశాలు నిర్వహించి.. ఆమె ఆధ్వర్యంలో ఇటీవల సీఎం కేసీఆర్కు నివేదించిన విషయం తెలిసిందే.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి
జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల గౌరవ వేతనాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం పట్ల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30% ఫిట్మెంట్ పెంచిన విధంగానే స్థానిక ప్రజాప్రతినిధులకూ వేతనాలు పెంచి వారి గౌరవాన్ని పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు కృతజ్ఞతలు తెలిపారు