ఖైరతాబాద్ : ‘ఒకప్పుడు చేపలను దిగుమతి చేసుకునే వారం. ఆంధ్రా, కోస్తా తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు చేపలు వచ్చేవి. నేడు తెలంగాణ నుంచి దేశ, విదేశాలకు చేపలను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే సాధ్యమైంది’ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండీఏ మైదానంలో 117 సంచార చేపల విక్రయ వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ అంటే అందరికీ బతుకుదెరువును ఇచ్చేదన్నారు. తెలంగాణ రాక ముందు మత్స్య పరిశ్రమ అంటే కోస్తాంధ్రకే పరిమితమని, కాని ఆ సంప్రదాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం చెరిపివేసిందన్నారు.
తెలంగాణ చేపలు మంచినీళ్లలో పెరుగుతాయని, దాని రుచి ఎక్కువగా ఉంటుందని, డిమాండ్ కూడా ఎక్కువేనన్నారు. తెలంగాణ ప్రజల మనస్సు ఎంత బాగుంటుందో తెలంగాణ చేప కూడా అంత మధురంగా ఉంటుందన్నారు. ఒకప్పుడు వర్షపు నీళ్లపైనే ఆధారపడిన వాళ్లంతా.. ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న చర్యల వల్ల చెరువులకు మహర్దశ వచ్చిందన్నారు. కాలమైనా… కాకపోయినా కృష్ణా, గోదావరి జలాలతో ప్రతి సంవత్సరం ఏడాదంతా చెరువులు నిండుగా ఉండేలా ప్రాజెక్టుల నీటితో నింపుతున్నారన్నారు. ఈ మార్చి నెలలో కూడా నల్లగొండ, కరీంనగర్, సూర్యాపేట, మెదక్, సిద్దిపేట, ఆదిలాబాద్ ఇలా ఎక్కడా చూసినా చెరువులు మత్తడి దూకుతున్నాయన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత పింక్ రెవెల్యూషన్తో గొల్ల కుర్మలు, బ్లూ రెవెల్యూషన్తో మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని హరీశ్రావు తెలిపారు. ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ చేప ఉండాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పదే పదే చెప్పారన్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీ 24 కోట్లతో ప్రారంభిస్తే నేడు 68 కోట్ల వరకు చేరుకున్నదన్నారు. ఈ సంవత్సరం వంద కోట్లతో ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని చోట్లా నాన్ వెజ్ అండ్ వెజిటేబుల్ (ఇంటిగ్రేటెడ్) మార్కెట్ల కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించామని తెలిపారు. తెలంగాణలోని అన్ని పట్టణాల్లో ఐదారు నెలల్లోనే ఈ మార్కెట్లు అందుబాటులోకి వస్తాయన్నారు.
రాష్ట్రంలో రూ.1,200 కోట్లతో పెద్ద ఎత్తున చెక్ డ్యామ్లు నిర్మిస్తున్నామని హరీశ్రావు తెలిపారు. ఈ సంవత్సరం రూ.1,200 కోట్లు, వచ్చే సంవత్సరం రూ.1,200 కోట్లు ఇలా రెండేండ్లలో మొత్తం రూ.2,400 కోట్లతో వాగులపై చెక్డ్యామ్లను నిర్మించనున్నామన్నారు. నేడు కాళేశ్వరంపై కట్టిన వరుస బ్యారేజీలతో గోదావరి 150 కిలోమీటర్లు జీవనదిగా మారిపోయిందని, గోదవరి నిండు గర్భిణిలా 365 రోజులు నీటి లభ్యతతో కళకళలాడుతున్నదన్నారు.
చేపల మీద రాష్ట్రంలో ఆదాయం రెట్టింపు అయ్యిందని.. రాబోయే రోజుల్లో ఐస్ ఫ్యాక్టరీలు, ప్యాకింగ్ ఇండస్ట్రీలు నెలకొల్పడానికి చొరవ తీసుకోవడంతో పాటు చేపలు ఎక్స్పోర్ట్ చేయడానికి టెక్నాలజీని సమకూర్చుతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దురదృష్టవశాత్తు మత్స్యకారుడు చనిపోతే రూ.6లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. రూ.10లక్షల విలువైన ఈ వాహనానికి రూ.6 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని.. అది కూడా మహిళల పేరిటనే అందజేస్తున్నామన్నారు.
ప్రస్తుతం 150 వాహనాలు సిద్ధం చేశామని, రాబోయే రోజుల్లో 500 వాహనాలను తయారు చేయిస్తామన్నారు. అనంతరం మత్స్య సహకార సొసైటీ సభ్యులకు రూ.5లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు డాక్టర్ బండా ప్రకాశ్, బీబీ పాటిల్, కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, దానం నాగేందర్, ముఠా గోపాల్, బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, కార్పొరేటర్ పి.విజయా రెడ్డి పాల్గొన్నారు.