కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ఉద్రిక్తతల నడుమ సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ఆరంభాగ్ అభ్యర్ధి సుజాత మొండల్పై మహల్లాపరలోని 263వ పోలింగ్ కేంద్రం వద్ద దాడి జరిగింది. బీజేపీ గూండాలే తమ పార్టీ అభ్యర్ధిపై దాడికి పాల్పడ్డారని టీఎంసీ నేత, ఆ పార్టీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల దాడిలో మొండల్ వ్యక్తిగత భద్రతాధికారి తలకు గాయాలయ్యాయని ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.
తమ కండ్ల ముందే ఇంత జరిగినా అక్కడే ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది మౌన ప్రేక్షకుల్లా వ్యవహరించారని ఈసీకి రాసిన లేఖలో తృణమూల్ ఎంపీ ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్ధిపై దాడికి పాల్పడిన బీజేపీ గూండాలను అరెస్ట్ చేయాలని ఈసీని కోరారు. పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన మహిళా అభ్యర్ధి సుజాత మొండల్పై బీజేపీ కార్యకర్తలు దాడికి పాల్పడటంతో ఆమెకు గాయాలయ్యాయని, ఖనాకుల్లో కూడా మరో అభ్యర్ధిపై బీజేపీ శ్రేణులు దాడి చేశారని ఆరోపించారు.