మున్సిపల్ కమిషనర్ క్రాంతి
అధికారులతో వ్యాక్సినేషన్పై సమీక్ష
కార్పొరేషన్, జూన్ 2: ప్రభుత్వ ఆదేశాల మేరకు కొవిడ్ వ్యాక్సినేషన్కు నగరంలోని పది కేటగిరిలకు చెందిన సూపర్ స్ప్రెడర్ల వివరాలను సేకరించాలని మున్సిపల్ కమిషనర్ క్రాంతి ఆదేశించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం శానిటేషన్, రెవెన్యూ విభాగం అధికారులు, సిబ్బందితో వ్యాక్సినేషన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, డివిజన్ల వారీగా కూరగాయలు, పండ్లు, పూలు, చికెన్, చేపలు, మాంసం విక్రయదారులు, చిరు వ్యాపారులు, కిరాణ షాపు, మద్యం దుకాణాల్లో పని చేసే వారు, హోటళ్ల నిర్వాహకులు, కార్మికులు, క్షౌరశాలలు, లాండ్రీషాపుల నిర్వాహకులను గుర్తించాలన్నారు. యాప్ లాగిన్ పాస్వర్డ్ ఇచ్చిన ఎన్యుమరేటర్లు ఒకొకరు 50 మందిని రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. యాప్లో వెండర్ పూర్తి వివరాలను పొందుపరిస్తే వ్యాక్సిన్ సెంటర్ వివరాలు సంబంధిత వ్యక్తికి మెసేజ్ రూపంలో వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు.
మెసేజ్లో ఇచ్చిన సమయం ప్రకారం సంబంధిత సెంటర్లలో వ్యాక్సిన్ తీసుకునేలా చూడాలని బిల్ కలెక్టర్లు, జవాన్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలను ఆదేశించారు. 18 ఏళ్లుపైబడిన వారందరికీ మొదటి డోస్ వేసేందుకు శనివారం మారెట్ సమీపంలోని వైశ్యభవన్, సిరిసిల్ల రోడ్డులోని బాలాజీ ఫంక్షన్హాల్, ఎస్సారార్ కళాశాలలో వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే యాప్ లాగిన్ పాస్వర్డ్, ఇతర వివరాలను ఎన్యుమరేటర్లకు అందించామని, వారు వెండర్లను గుర్తిస్తారన్నారు. పది రోజుల పాటు రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వర్, డిప్యూటీ కమిషనర్ త్రియంభకేశ్వర్, ఆర్వో, ఆర్ఐలు, బిల్ కలెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లు పాల్గొన్నారు.