న్యూఢిల్లీ, ఆగస్టు 1: కొన్ని రాష్ర్టాల్లో రోజువారీ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని, వైరస్ కట్టడికి ఆయా రాష్ర్టాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా సూచించారు. సూపర్ స్ప్రెడ్ ఈవెంట్లను నిరోధించాలన్నారు. వైరస్ సోకిన ఒక వ్యక్తి నుంచి ఎంతమందికి వ్యాపిస్తుందనే సూచిక ‘ఆర్ విలువ’ క్రమంగా పెరుగటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఆర్ విలువ ప్రస్తుతం 0.96గా ఉందని ఇది క్రమంగా 1కి పెరుగుతున్నదని అన్నారు. 0.96 అంటే 100 మందికి వైరస్ సోకితే వారి నుంచి మరో 96 మందికి వ్యాపిస్తున్నదని అర్థం. దేశంలో రోజువారీ కేసుల్లో సగం కేరళ నుంచే నమోదు కావడంపై ఆయన మాట్లాడారు. ‘కేరళ మొదట్లో వైరస్ను కట్టడి చేసింది. వ్యాక్సినేషన్ కూడా బాగా జరుగుతున్నది. అయినప్పటికీ ఇప్పుడు అక్కడ కేసులు పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏమిటన్నదానిపై అధ్యయనం చేయాలి. ఏదైనా వేరియంట్ కారణమా? లేక కొవిడ్ నిబంధనలు పాటించడంలో అలసత్వమా అన్నది పరిశోధించాలి’ అని వ్యాఖ్యానించారు. పక్క రాష్ర్టాలు కర్ణాటక, తమిళనాడు అప్రమత్తంగా ఉండాలని, టెస్ట్, ట్రాక్, ట్రీట్ విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని సూచించారు.
కచ్చితమైన సంఖ్య లేదు
తమిళనాడులో 66శాతం మందిలో యాంటిబాడీలున్నట్టు సెరో సర్వేల్లో తేలినప్పటికీ అక్కడ కేసులు పెరుగుతున్నాయని గులేరియా తెలిపారు. సెరో సర్వే ఫలితాలు హెర్డ్ ఇమ్యూనిటీకి సంకేతాలు కాదని పేర్కొన్నారు. కాలంతో పాటు శరీరంలో యాంటిబాడీలు కూడా తగ్గిపోతాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. సర్వే సమయంలో ఉన్న యాంటిబాడీలు కొంత కాలానికి తగ్గొచ్చని పేర్కొన్నారు. ఎంత శాతం మందిలో యాంటిబాడీలు ఉంటే హెర్డ్ ఇమ్యూనిటీనో చెప్పడానికి కచ్చితమైన సంఖ్య ఏదీ లేదన్నారు.
బూస్టర్ డోసుపై సమాచారం లేదు
బూస్టర్ డోసులపై కూడా గులేరియా స్పందించారు. బూస్టర్ డోసులు అవసరమా.. కాదా.. అన్నదానిపై ఇంకా తగినంత సమాచారం లేదన్నారు. చాలా మంది మొదటి డోసే వేసుకోలేదని, ఈ పరిస్థితుల్లో బూస్టర్ డోసు గురించి మాట్లాడటం సమంజసం కాదని చెప్పారు.
కేరళలో వరుసగా ఆరోరోజు 20వేలకు పైగా
శనివారం దేశవ్యాప్తంగా 41వేల కేసులు నమోదైతే అందులో 20,728 కేరళ నుంచే ఉన్నాయి. రాష్ట్రంలో 20వేలకు పైగా కేసులు నమోదుకావడం ఇది వరుసగా ఆరో రోజు. ఇక్కడ పాజిటివిటీ రేటు కూడా చాలా ఎక్కువగా(12.31శాతం) ఉన్నది. రాష్ట్రంలో కొత్తగా 56 మంది చనిపోయారు.