తాడ్వాయి, మే 27/హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి సిద్ధబోయిన సమ్మారావు(28) గురువారం అనారోగ్యంతో మరణించారు. ఇరవై రోజుల కిందట ఆయనకు కరోనా రాగా.. హోంఐసొలేషన్లోనే చికిత్సపొంది కోలుకున్నారు. అనంతరం ఆయన భార్య సృజనకు కరోనా పాజిటివ్ వచ్చింది. హోం ఐసొలేషన్లో ఉన్న ఆమె పరిస్థితి విషమించడంతో.. ములుగు ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్సపొందుతూ ఈ నెల 12న మృతిచెందింది. వారం రోజుల తర్వాత సమ్మారావు అనారోగ్యం బారినపడ్డారు. కుటుంబసభ్యులు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా.. చికిత్సపొందుతూ గురువారం మృతిచెందారు. రెండు వారాల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందడంతో మేడారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమ్మారావుకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పూజారి మృతిపట్ల దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. 15 రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతిచెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.కుటుంబానికి అండగా ఉంటామని హామీ సమ్మారావు దంపతుల మృతితో వారి ఇద్దరు పిల్లల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి సత్యవతి రాథోడ్ హామీఇచ్చారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు.