హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని రైతు సమన్వయ సమితి రాష్ర్ట అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో, ధాన్యం కొనుగోళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్న బీజేపీ నేతల వ్యాఖ్యలను పల్లా తీవ్రంగా ఖండించారు. ఏ రాష్ర్టంలో కొనుగోలు చేయని విధంగా, లాక్డౌన్ ఉన్నప్పటికీ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరిసాగు చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచామన్నారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేశామని తెలిపారు. రాష్ర్టంలో పెద్ద ఎత్తున ధాన్యాన్ని సేకరిస్తున్నామని స్పష్టం చేశారు. నలుగురు ఎంపీలు ఉన్నామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు.. దమ్ముంటే కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టుల్లో ఏదైనా ఒకదానికి జాతీయ హోదా తీసుకురావాలని డిమాండ్ చేశారు.
రైతుబంధు పథకం కింద 60 లక్షల మంది రైతులకు రూ. 15 వేల కోట్లు ప్రభుత్వం అందిస్తోందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ర్టంలో వేలాది రైతు వేదికలు నిర్మించామన్నారు. రూ. 750 కోట్ల వ్యయంతో లక్ష రైతు కల్లాలను ఏర్పాటు చేశామని తెలిపారు. రైతుబీమా పథకం ద్వారా రైతు చనిపోయిన 10 రోజుల్లోపే రూ. 5 లక్షలు చెల్లిస్తున్నాం. ఈ పథకం ద్వారా 50,600 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేశామన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతు సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా? అని పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.