హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లాలోని నష్కల్ రైల్వేట్రాక్పై రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి రాజు సూసైడ్ చేసుకున్నట్లు లోకో పైలట్ పోలీసులకు తెలిపాడు. చేతి మీద వేయించుకున్న మౌనిక అనే పచ్చబొట్టు ద్వారా రాజుగా పోలీసులు గుర్తించారు.
గత ఏడు రోజుల నుంచి రాజు కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. రాజును పట్టుకునేందుకు 70 బృందాలను పోలీసులు రంగంలోకి దించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాజు ఆచూకీ కోసం పోలీసులు జల్లెడ పట్టారు. ఈ నెల 9వ తేదీన సైదాబాద్లో చిన్నారిపై రాజు హత్యాచారం చేశాడు. నాటి నుంచి రాజు కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. ఇక అన్ని వైన్ షాపుల వద్ద నిందితుడు రాజు ఫోటోను ఉంచి నిఘా పెట్టారు. బస్సులు, ఆటోలపై రాజు ఫోటోలు ప్రదర్శించి.. అతని ఆచూకీ కోసం విస్తృతంగా తనిఖీలు చేశారు. రాజు నిన్న ఉప్పల్ ప్రాంతంలో సంచరించినట్లు తెలుస్తోంది. రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించిన విషయం తెలిసిందే.