హైదరాబాద్, ఆగస్ట్ 1 (నమస్తే తెలంగాణ)/నెట్వర్క్: కృష్ణా బేసిన్లో జల సవ్వడులు కొనసాగుతున్నాయి. ఎగువ నుంచి దిగువదాకా అన్ని జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలం నుంచి భారీ ఇన్ఫ్లోలు కొనసాగుతుండటంతో నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. దీంతో ఆదివారం సాయంత్రం అధికారులు ప్రాజెక్టు క్రస్ట్గేట్లను తెరిచారు. ఆగస్టు1నే గేట్లు తెరవడం ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారి. ముందుగా 13, 14వ గేట్లను తెరిచిన అధికారులు.. ఆ తర్వాత ఒక్కొక్కటిగా 14 గేట్లను 5 అడుగులమేర పైకెత్తి 1,06,462 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మరోవైపు ఎడమ కాలువ కింద వానకాలం సాగుకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు అటు జూరాల, ఇటు సుంకేశుల నుంచి 4,31,727 క్యూసెక్కుల ఇన్ఫ్లోలు వచ్చి చేరుతున్నాయి. శ్రీశైలం నుంచి 10 గేట్లు, జూరాల ప్రాజెక్టు నుంచి 47 గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. జూరాలకు వరద తాకిడి ఎక్కువగా ఉండటంతో ఎగువ, దిగువ జల విద్యుత్కేంద్రాలలో విద్యుదుత్పత్తిని నిలిపివేసినట్టు అధికారులు తెలిపారు. ఆదివారం ప్రాజెక్టులకు సందర్శకులు పోటెత్తారు. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. శ్రీశైలం జలాశయం వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు అన్ని ప్రాజెక్టుల వద్ద ఇదే పరిస్థితి నెలకొన్నది.