తొలుత ఢిల్లీ దవాఖానలకు 10 వేల డోసులు
న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డీఆక్సీ-డీ-గ్లూకోజ్ (2-డీజీ) ఔషధం సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నది. ఢిల్లీలోని దవాఖానలకు 10 వేల 2-డీజీ డోసుల ప్యాకెట్లను కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సోమవారం అందజేయనున్నారు.అత్యవసర వినియోగం కోసం డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఇటీవలే ఈ ఔషధానికి అనుమతినిచ్చింది.
ఎలా వాడాలంటే?
2-డీజీ పౌడర్ రూపంలో ఉంటుంది. నీటిలో కలుపుకొని తాగాలి. కరోనా రోగుల చికిత్సకు ఇది సురక్షితమని, రోగులు దవాఖానల్లో చేరే అవకాశాల్ని తగ్గిస్తుందని, ఆక్సిజన్పై ఆధారపడుతూ చికిత్స తీసుకోవడాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధకులు తెలిపారు. ఈ ఔషధంలోని ఓ రకమైన సూడో గ్లూకోజ్ మాలిక్యూల్స్ వైరస్ తీవ్రతను తగ్గిస్తాయని వెల్లడించారు.