ఇంటింటా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి
కలెక్టర్ కె.శశాంక
అధికారులతో టెలీకాన్ఫరెన్స్
విద్యానగర్, మే 5: జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వెంటనే ఓపీ పరీక్షలు ప్రారంభించాలని కలెక్టర్ కె.శశాంక మెడికల్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి మెడికల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, మండల పంచాయతీ అధికారులతో వ్యాక్సినేషన్, కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, కొవిడ్ నియంత్రణ చర్యలపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ దవాఖానలు, పీహెచ్సీల్లో కొవిడ్, ఓపీ పరీక్షలు నిర్వహించి వైరస్ లక్షణాలున్న వారికి ఐసొలేషన్ కిట్లు ఇవ్వాలని సూచించారు. బుధవారం నుంచే పట్టణాలు, గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ, మున్సిపల్ సిబ్బంది టీంలుగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. ఎవరికైనా కరోనా లక్షణాలుం టే వెంటనే వారికి కిట్లు అందించి హోంఐసొలేషన్లో ఉంచాలని, తగిన జాగ్రత్తలు తెలుపాలన్నా రు. 1,000-1,500 మందికి ఒక టీం చొప్పున నియమించాలని అధికారులను ఆదేశించారు. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, మున్సిపల్, పంచాయతీ సిబ్బందితో టీంలు ఏర్పాటు చేయాలన్నారు. ఇంటింటి సర్వే ద్వారా త్వరగా కరోనా లక్షణాలున్నవారిని గుర్తించి వారికి వెంటనే చికిత్స అందించాలన్నారు. మండల టాస్ఫోర్స్ కమిటీలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షల వివరాలు, ఐసొలేషన్ కిట్ల పంపిణీ వివరాలను పర్యవేక్షించాలన్నారు.
అన్ని ప్రైవేట్ దవాఖాన్లలో కూడా కొవిడ్, ఓపీ పరీక్షలను ప్రారంభించాలని, కరోనా లక్షణాలున్నవారిని వెంటనే చేర్చుకొని సేవలందించాలన్నారు. జిల్లాలో 45 ఏండ్లు దాటినవారు ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకుంటేనే టీకా వేయాలని సూచించారు. 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ టీకా వేసుకునేలా సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు చొరవ చూపాలన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో కొవిడ్ పరీక్షల బ్యానర్లు ప్రదర్శించాలని, కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్కు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూ చించారు. జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో గురువారం నుంచి ఇంటింటికీ వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత, ప్రో గ్రాం ఆఫీసర్లు, మెడికల్ ఆఫీసర్లు, జిల్లా పరిషత్ సీఈవో రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.