తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం బుధవారం టీఆర్ఎస్ఎల్పీలో విలీనం కావడంతో రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా భూస్థాపితమైందనవవచ్చు. వాస్తవానికి టీడీపీని తెలంగాణ ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి మూడున్నర శాతం ఓట్లు మాత్రమే లభించాయి. టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా వ్యక్తిగత బలం వల్ల గెలిచారే తప్ప పార్టీ వల్ల కాదు. టీడీపీని ఇంకా ఎంతకాలమని మోయగలరు! మరోవైపు తెలంగాణ ప్రజల ఏకైక ప్రాతినిధ్య శక్తిగా టీఆర్ఎస్ వెలిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ప్రజాభీష్టం మేరకు టీడీపీ ఎమ్మెల్యేలు ఇరువురూ టీఆర్ఎస్ వైపు మొగ్గారు.
టీడీపీ అంతర్ధానంతో విద్వేష, విభజన రాజకీయాలతో కూడిన దుర్గంధపూరిత అధ్యాయం ముగిసినట్టయింది. ప్రజల మధ్య కులాలు, ఉపకులాల పేర విభజన రేఖలు సృష్టించడం, మీడియా ద్వారా ప్రచారార్భాటం, ధనబలంతో జనాభిప్రాయాన్ని వక్రీకరించడం, నోట్లతో ఓట్లు కొల్లగొల్లడం మొదలైనవి రాజకీయ క్షేత్రంలో టీడీపీ నాటిన విషబీజాలు. చంద్రబాబుకు తెలంగాణ మీదున్న అక్కసు వర్ణనాతీతమైనది. అసెంబ్లీలో తెలంగాణ పదాన్నే ఉచ్ఛరింపనివ్వలేదు. ఎన్నికల ముందు తెలంగాణ అనుకూల తీర్మానం చేసి, చిదంబరం ప్రకటన వెలువడగానే మాట మార్చారు. తెలంగాణ రాగానే హైదరాబాద్ ఖాళీ అవుతుందని, పరిశ్రమలు తరలిపోతున్నాయనీ, మెట్రో రైలు దివాలా తీస్తుందని తమ పత్రికల చేత ప్రచారం చేయించారు. రాష్ట్ర విభజనను ఆమోదించలేక, బెర్లిన్ గోడ కూలిపోలేదా అని వ్యాఖ్యానించారు. ఇక్కడ పొలాలు ఎండిపోతున్నా కూడా, విద్యుత్ సరఫరా నిలిపివేసి విభజన చట్టాన్ని ఉల్లంఘించారు. మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు పన్నడం చంద్రబాబు పతన రాజకీయాలకు పరాకాష్ఠ.
తెలంగాణలో 2004లోనే టీడీపీ పునాదులు పెకిలించుకుపోయాయి. చంద్రబాబు కుట్రలను తట్టుకోలేక, కాంగ్రెస్ నాయకులు డీలాపడి ఉన్నదశలో, వారికి ఆశారేఖలా కేసీఆర్ కనిపించారు. టీడీపీ వరుసగా గెలుస్తున్న స్థానాలలో తాము పోటీ చేస్తామని కాంగ్రెస్ నాయకత్వానికి కేసీఆర్ ప్రతిపాదించారు. ఈ విధంగా 2004 ఎన్నికల్లో టీడీపీకి మూలస్తంభాల వంటి బలమైన నాయకులను మట్టి కరిపించడం ద్వారా కేసీఆర్ ఆ పార్టీని చావుదెబ్బ కొట్టారు. కానీ రాజకీయ రంగంలో చంద్రబాబు ప్రవేశ పెట్టిన దుష్ట సంస్కృతిని ప్రక్షాళన చేయడం అంత సులభం కాదు. ప్రజాకేంద్ర రాజకీయాలను ప్రవేశ పెట్టి, అభివృద్ధి- సంక్షేమ అజెండాను ముందుకు తేవడంలో కేసీఆర్ విజయవంతమయ్యారు. చంద్రబాబు తాబేదారువర్గాన్ని, విద్వేష భావజాలాన్ని రూపుమాపడానికి మరికొంత కాలం పట్టవచ్చు. ప్రజల విశ్వసనీయత కోల్పోయిన, నీతి నియమాలు లేని ఏ రాజకీయ పక్షమూ దీర్ఘకాలికంగా నిలువలేదనడానికి టీడీపీయే ఉదాహరణ.