సువిశాల భారతదేశంలో 28 రాష్ర్టాలున్నాయి.
అందులో తెలంగాణ 28వ రాష్ట్రం.. తెలంగాణ మినహా మిగతా 27 రాష్ర్టాల్లో ఒక్క రాష్ట్రం.. ఏ ఒక్క రాష్ట్రం కూడా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనడంలేదు. క్వింటాలు సంగతి పక్కన పెట్టండి, కిలో కూడా సేకరించడం లేదు. అలా చేస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం.. తెలంగాణ రాష్ట్రం.
ధాన్యం అమ్ముకోవాలంటే ఒకప్పుడు అరిగోస. రైతు ధాన్యాన్ని తూర్పారబట్టి బస్తాల్లో నింపుకొని వ్యవసాయ మార్కెట్కు వెళ్లి పడిగాపులు కాయాలి. లేదంటే ఊర్లోనే అడ్డికి పావుసేరు చొప్పున అమ్ముకోవాలి. కాలు బయట పెట్టాలంటేనే కాంటా కూలీ, హమాలీ.. లారీ డ్రైవరు, క్లీనరూ జడుసుకుంటున్న ఈ క్లిష్ట సమయంలో తెలంగాణలో ఊరూరికీ వెళ్లి ధాన్యాన్ని కొంటున్నఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.
ఇది కరోనా కాలం. సామాన్యుడు మొదలు సర్కారుదాకా అందరూ కాసుల కోసం కటకటలాడుతున్న కాలం. ఎక్కడ పైసా దొరుకుతుందా.. ఎక్కడ రూపాయి మిగులుతుందా అని ఎదురుచూస్తున్న కాలం! ఈ కరోనా కాలంలో సైతం.. ఈ కష్ట కాలంలో సైతం.. వ్యవసాయం కోసం రైతన్నకు ముందే పెట్టుబడి సాయం అందిస్తున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన కేసీఆర్.
మహీతలాన్ని మహమ్మారి చుట్టుముట్టి మారణహోమం సృష్టిస్తున్న రోజుల్లో సైతం అద్భుతాలు సృష్టిస్తూ.. అంచనాలకు మించి దిగుబడులు సాధిస్తూ.. 27 రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది..
ఒకే ఒక్కడు మన తెలంగాణ రైతన్న!
ఈ అసాధ్యం సుసాధ్యం కావడానికి కారణమైన నికార్సైన రైతు.. అసలు సిసలు రైతు బంధువు
ఒకే ఒక్కడు కేసీఆర్.
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): జూన్ 15 నుంచి 25 వరకు రైతుబంధు ఆర్థిక సాయాన్ని ఎప్పటిలాగే ఆయా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆర్థికశాఖ కార్యదర్శిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశించారు. దీంతోపాటు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ కు మారిన భూములకు జూన్ పదో తేదీ కటాఫ్గా పెట్టుకొని రైతుబంధును వర్తింపజేయాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఆర్వోఎఫ్ఆర్ భూములకు కూడా రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతిభవన్లో శనివారం వ్యవసాయరంగం, విత్తనాల లభ్యత, కల్తీ విత్తనాల నిరోధం, రైతుబంధు పంపిణీ, ధాన్యం సేకరణపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అనేక అంశాలపై విస్తృతంగా చర్చించారు.
నూతన తెలంగాణ రాష్ట్రంలో ఆరునూరైనా వ్యవసాయరంగాన్ని పునర్జీవింపచేసి, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలనే సిద్ధాంతంతో, వ్యవసాయరంగాన్ని స్థిరీకరించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. మిషన్ కాకతీయతోపాటు, సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో విజయం సాధించామని, రాష్ట్ర వ్యవసాయరంగ ముఖచిత్రాన్ని గుణాత్మకంగా మార్చివేసామని చెప్పారు. కేసులేసి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అవాకులు చవాకులు పేలినా, కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వెనుకడుగు వేయకుండా పట్టుపట్టి పూర్తిచేసుకోగలిగామని తెలిపారు.
తెలంగాణ రైతుకు నేడు వ్యవసాయం మీద ధీమా పెరిగిందని సంతోషం వ్యక్తంచేశారు. అంకితభావంతో, రైతు సంక్షేమం వ్యవసాయాభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో, తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టడంవల్లనే అనుకొన్న లక్ష్యాన్ని చేరుకోగలిగామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వానకాలం సీజన్ ప్రారంభమౌతున్న నేపథ్యంలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కల్తీ విత్తనాలు, ఫెస్టిసైడ్స్, బయో పెస్టిసైడ్స్ పేరుతో మారెట్లోకి వస్తున్న కల్తీ ఉత్పత్తుల మీద ఉకుపాదంమోపాలని వ్యవసాయ, పోలీసు, ఇంటెలిజెన్స్ శాఖలకు సీఎం కేసీఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.
ఇకనుంచి విత్తనాలు, పెస్టిసైడ్లను అనుమతించిన కంపెనీల ద్వారా మాత్రమే విక్రయాలు జరిగేలాచూడాలని, ప్రభుత్వం జారీచేసే క్యూ ఆర్ కోడ్ సీడ్ ట్రేసబిలిటీ విధానాన్ని అమలుచేయాలని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డిని సీఎం ఆదేశించారు. విత్తనాలు, ఫెస్టిసైడ్లలో కల్తీని అరికట్టడానికి కఠిన నిబంధనలను అమలుచేస్తూ, అవసరమైన చట్ట సవరణచేయాలని, అందుకు సంబంధించి అవసరమైతే ఆర్డినెన్స్ జారీచేయాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం ఆదేశించారు.
అన్నదాతలకు వెన్నుదన్ను
ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ఆర్థిక సా యం వ్యవసాయాభివృద్ధికి దోహద పడుతున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా రైతు ఖాతాలోనే జమ అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పంటసాయం వల్ల రైతు షావుకారు దగ్గరికి అప్పునకు పోకుండా సకాలంలో వ్యవసాయం చేసుకొంటూ ఎరువులు, విత్తనాలు కొని పంటకు పెట్టుబడి పెట్టి అధిక దిగుబడిని సాధించగలుగుతున్నారని సీఎం ప్రశంసించారు. ఉద్యోగుల నియామకం వంటి చర్యలతో వ్యవసాయశాఖను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, వారి కృషి కూడా ప్రభుత్వ లక్ష్యానికి తోడయిందని గుర్తుచేశారు. వ్యవసాయరంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించడం ద్వారా కూడా అభివృద్ధిని సాధించగలిగామని, ఇట్లా ఒకటొకటిగా వ్యవసాయనుబంధ రంగాలను అభివృద్ధిపరుచుకొంటూ రావడం ద్వారానే తెలంగాణ వ్యవసాయం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. రా ష్ట్రంలో వ్యవసాయం రాష్ట్ర సంపదకు తోడయ్యేవిధంగా ముందుకు సాగుతున్నదని సీఎం తెలిపారు.
జూన్ 15 నుంచి రైతుబంధు
జూన్ 15 నుంచి 25 లోపల రైతుబంధు పథకం కింద పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ఆర్థిక సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేయాలని సీఎం కేసీఆర్ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. గత యాసంగిలో అవలంబించిన విధానాన్నే ఇప్పుడు కూడా అవలంబిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయాలని సీఎం ఆదేశించారు. ఇప్పటిదాకా ఇచ్చిన క్యాటగిరీల వారిగానే రైతుబంధు ఆర్థికసాయాన్ని ఖాతాలో వేయాలని సూచించారు.
వ్యవసాయరంగంలో విప్లవాత్మక అభివృద్ధి
‘తెలంగాణ వ్యవసాయం ఎకడ ప్రారంభమైంది.. ఎంత ఉన్నతస్థాయికి చేరుకొన్నదనే విషయాన్ని పరిశీలించినప్పుడు సంభ్రమాశ్చర్యం కలుగుతుంది. నీటికి కటకటలాడిన తెలంగాణలో నేడు 75 శాతం చెరువులు నదీజలాలతో నిండి ఉన్నయి. నడి ఎండాకాలంలో నిండుకుండలను తలపిస్తున్నవి. ఒక వాన పడితే చెరువులు అలుగులు దుంకడానికి సిద్ధంగా ఉన్నవి. రెండు పంటలకు కలిపి తెలంగాణలో నేడు కోటిన్నర టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతు పండిస్తున్నారంటే మామూలు విషయంకాదు. పంజాబ్కు సరిసమానంగా తెలంగాణలో వరిధాన్యం దిగుబడి అవుతున్నది. అంతే ధాన్యాన్ని ఇవ్వాళ ప్రభుత్వం ఒక గింజను పోనియ్యకుంటా నేరుగా రైతు వద్దనుంచి కల్లాల్లోనే కొంటున్నది. కరోనా వంటి కష్టకాలంలో దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతునుంచి ధాన్యాన్ని కొంటున్నది. అందుకు మనం గర్వపడాలి’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఇద్దరు అదనపు డైరెక్టర్లను నియమించుకోండి
వ్యవసాయశాఖ రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులను నియమించుకోవాలని సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మంత్రిని ఆదేశించారు. విత్తనాలు, ఎరువులు, ఫెర్టిలైజర్ల వ్యవహారాలుచూసేందుకు ఒకరిని, మారెటింగ్ అనాలసిస్ రిసెర్చ్ వింగ్ కోసం మరో అడిషనల్ డైరక్టర్ను నియమించుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ను నిర్దేశించారు. ఈ సమావేశంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, బండి కృష్ణమోహన్రెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్రావు, కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్రావు, పౌరసరఫరాల కార్పొరేషన్ కమిషనర్ అనిల్కుమార్, సీడ్స్ కార్పొరేషన్ ఎండీ కేశవులు పాల్గొన్నారు.
సాగునీటి రంగాభివృద్ధే కారణం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం తద్వారా నీటిపారుదలరంగంలో చోటుచేసుకొన్న విప్లవాత్మక మార్పులు వ్యవసాయరంగం అభివృద్ధిపథాన దూసుకొనిపోవడానికి ముఖ్య కారణాలను సీఎం వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులన్నీ పటిష్ఠంగా మారాయని తెలిపారు. కట్టలు తెగకుండా.. వచ్చిన నీటిబొట్టును వచ్చినట్టే చెరువులు ఒడిసిపట్టుకున్నాయని చెప్పారు. దీంతో భూగర్భజలాలు కూడా పెరుగుతున్నాయని గుర్తుచేశారు. ప్రభుత్వం అందించే 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ద్వారా బోరు బావులతో పంటలు పండుతున్నాయని తెలిపారు. కృష్ణా గోదావరి నదుల మీద ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కట్టుకోవడం, కాళేశ్వరం, దేవాదుల వంటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం, కొత్త ప్రాజెక్టులను మొదలుపెట్టడం వంటి ప్రభుత్వ చర్యల వలన వ్యవసాయరంగంలో తెలంగాణ ఇంతటి ఘన విజయాన్ని సాధించగలిగిందని సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఆర్వోఎఫ్ఆర్ భూములకు రైతుబంధు
జూన్ 10 వ తేదీని కటాఫ్ డేట్గా పెట్టుకొని ఆ తేదీ వరకు పార్ట్ బీ నుంచి పార్ట్ ఏ లోకి చేరిన భూములకు రైతుబంధు వర్తింపచేయాలని సీఎం ఆదేశించారు. అదేవిధంగా ఆర్వోఎఫ్ఆర్ భూములకు కూడా రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పోడు భూముల్లో ఎన్నో ఏండ్లుగా వ్యవసాయం చేసుకొంటున్న గిరిజన రైతులకు ముఖ్యమంత్రి ఔదార్యంతో తీసుకొన్న ఈ నిర్ణయం ఊరట కలిగిస్తుంది. ఇలాంటి పోడు భూములు దాదాపు లక్ష ఎకరాలు ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇకనుంచి గిరిజన రైతులకు కూడా ఇతర రైతులమాదిరిగానే రైతుబంధు పెట్టుబడిసాయం అందుతుంది.
వెదజల్లే పద్ధతిని ప్రోత్సహించాలె
వ్యవసాయశాఖ అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): వరి పంటను నాటు పద్ధతి కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా సాగుచేస్తే పెట్టుబడి మిగులుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. శనివారం ప్రగతిభవన్లో వ్యవసాయశాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో వరి నాటులో ధాన్యం వెదజల్లే పద్ధతి గురించి ప్రత్యేకంగా చర్చించారు. రెండు పంటలకు కలిపి కోటి ఎకరాలు సాగుచేసే తెలంగాణ రైతులకు సుమారు రూ.10 వేల కోట్లపైనే పెట్టుబడి మిగులుతుందని పేర్కొన్నారు. ఈ పద్ధతిలో వరి సాగుచేస్తే ఎకరానికి 2-3 బస్తాలు అధిక దిగుబడి రావొచ్చని పేరొన్నారు. ఈ పద్ధతిలో వరి సాగుచేసే అంశంపై రైతుల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కూలీల గొడవ ఉండదు
‘వెదజల్లే పద్ధతి ద్వారా నారుపోసే పని ఉండదు, నారు పీకే పని ఉండదు. నాటు పెట్టే పని ఉండదు. కూలీల కోసం గొడవ ఉండదు. కలుపు కూలీల ఇబ్బంది ఉండదు. నీటి వినియోగం 30 నుంచి 35% తగ్గుతుంది. 10-15 రోజుల ముందు క్రాప్ వస్తుంది. మామూలు పద్ధతిలో ఎకరానికి 25 కిలోల విత్తనాలు కావాలి. ఈ వెదజల్లే పద్ధతి అయితే 8 కిలోల విత్తనాలు సరిపోతాయి. వడ్లు వెదజల్లిన తరువాత ఎన్ని రోజులకైనా నీళ్లు కట్టుకోవచ్చు. విత్తన పొడ్లు వెదజల్లినంక వర్షం పడేదాక కొన్నిరోజులు ఎదురుచూస్తే ఇంకా మంచిది. కాళేశ్వరం సహా అన్ని సాగునీటి ప్రాజెక్టులు, లిఫ్టులు, సుమారు 30 లక్షల బోరుబావుల పరిధిలో వరి సాగుచేసే రైతులకు ఈ పద్ధతి ఉపయోగపడుతుంది. ఖమ్మం జిల్లాలో ఈ వెదజల్లే పద్ధతిలో వరి రైతులను పిలిచి దీనిపై స్టడీ చేశాను. నేను రైతును కాబట్టి నా పొలంలో ఈ విధానంలో వరి సాగుచేసి మంచి ఫలితాలు పొందాను. ఈ పద్ధతిలో విత్తనపొడ్లు చల్లడానికి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణలో వరి సాగుచేసే రైతులందరూ ఈ పద్ధతిని అనుసరిస్తే మంచిది’ అని సీఎం వివరించారు.