రూ.200 పెట్టుబడికి 400 లాభం. అబ్బో బలేగుందే అని ఆశపడ్డారో.. మీరు సైబర్ నేరగాళ్ల బుట్టలో పడ్డట్టే.. ఆ చిన్న పెట్టుబడి లక్షల్లోకి చేరగానే నేరగాళ్లు కొత్త పంథా తొక్కుతారు. రూపాయల ను డాలర్లుగా, డాలర్లను బిట్కాయిన్లుగా మార్పించి.. నగదునువా రి ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. ఆధారాలు చిక్కకుండా సొమ్ము మటాష్ చేస్తున్నారని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు సైబర్ నేరగాళ్లు కొత్తగా ఆలోచిస్తున్నారు. చిన్న పెట్టుబడులకు పెద్ద లాభాలంటూ నమ్మిస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఏజెన్సీల ఆర్థిక లావాదేవీల ఖాతాలను ఉపయోగించుకొని.. కమీషన్ ఏజెంట్ల సాయంతో సామాన్యులతో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఆపై లాభాలు వచ్చాయంటూ అవే ఖాతాల సాయంతో డబ్బు జమచేస్తున్నారు. బాధితులు నమ్మి రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధం కాగానే.. సైబర్ దొంగలు పంథా మారుస్తున్నారు. పెట్టుబడిని డాలర్ల కింద మార్చాలని సూచిస్తున్నారు. నేరగాళ్లు రూపొందించిన వెబ్సైట్లో ఉన్న ఓ ఐడీలింక్ ద్వారా డాలర్లతో బిట్కాయిన్లను కొనుగోలు చేయిస్తున్నారు. చాలామంది ఆన్లైన్ ద్వారా రూపాయలను డాలర్లుగా మార్చుకుంటున్నారు. వాటిని బిట్ కాయిన్స్గా మార్చి నేరగాళ్లకు బదిలీ చేసేస్తున్నారు. ఆపై మో సపోయామని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఇటీవలి ఇన్వెస్ట్మెంట్ మోసాల్లో సైబర్ క్రైం పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆధారాలు దొరకకుండా ఉండేందుకే సైబర్ దొంగలు బిట్కాయిన్స్ కొనుగోలు చేయించి లింక్లోని ఐడీద్వారా నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటున్నారని గుర్తించారు. ఐడీ ద్వారా బిట్కాయిన్ రూపం లో బదిలీ అయిన నగదు ఖాతా ప్రపంచంలో ఎక్కడైనా ఉండొచ్చని, దానికి సంబంధించిన వివరాలు దొరకవని పోలీసులు తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ బాధితుడు ఏకంగా రూ.20 లక్షలు ఇలా బదిలీ చేసి మోసపోయాడు.