హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టీకాలు వేసుకొన్నవారు కోటి దాటారు. మొదటిడోసు టీకా తీసుకున్నవారి సంఖ్య 86,06,292కు చేరగా, రెండో డోసు తీసుకున్న వారి సంఖ్య 14,47,066కు చేరింది. దీంతో శుక్రవారం సాయంత్రం వరకు 1,00,53,358 టీకాలు రాష్ట్ర ప్రజలకు వేసినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా హైదరాబాద్లో 22లక్షల టీకాలు, రంగారెడ్డిలో 12 లక్షలు, మేడ్చల్ మల్కాజిగిరిలో 11 లక్షలు, వరంగల్ అర్బన్లో 4లక్షలు, కరీంనగర్లో 3 లక్షల టీకాలు వేసినట్టు తెలిపింది. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్కుమార్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కేక్ కట్ చేశారు. వైద్యారోగ్యశాఖ అధికారులను, ఉద్యోగులను, క్షేత్రస్థాయి సిబ్బందిని అభినందించారు. టీకాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలను ప్రారంభించారు. వ్యాక్సిన్లపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్యశాఖ రూపొందించిన వీడియో సాంగ్ను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి టీకాలు పూర్తి చేసుకోవడం చారిత్రాత్మకమన్నారు. మొత్తం 2.20 కోట్ల మందికి టీకాలు వేసే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం టీచర్లకు టీకాలు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంహెచ్ శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్రెడ్డి, ఆరోగ్యశాఖ ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 2.11 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్టు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.