హైదరాబాద్,మే 9 (నమస్తే తెలంగాణ): కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షను ‘గోల్డెన్ టెస్ట్’గా పిలుస్తారు. వైరస్ను గుర్తించడంలో ప్రస్తుతం ఉన్న విధానాల్లో కచ్చితత్వం ఎక్కువగా ఉన్న పరీక్షగా నిపుణులు దీనిని అభివర్ణిస్తున్నారు. ఇందులో వచ్చే సీటీ వాల్యూను బట్టి పాజిటివ్ లేదా నెగెటివ్గా నిర్ధారిస్తుంటారు. మరి సీటీ వాల్యూ అంటే ఏమిటి? ఇది ఎంత ఉంటే కొవిడ్ సోకినట్టు నిర్ధారిస్తారు? వంటి సందేహాలు సామాన్యుల్లో తలెత్తుతున్నాయి.
ఆర్టీపీసీఆర్ పరీక్ష కోసం ముక్కుతోపాటు గొంతు నుంచి నమూనాలను సేకరిస్తారు. ఆ తర్వాత దీనిని ల్యాబ్లో పరీక్షిస్తారు. కొవిడ్-19 అనేది ఆర్ఎన్ఏ వైరస్. కాబట్టి.. వ్యక్తి నుంచి సేకరించిన నమూనాలో ముందుగా ఆర్ఎన్ఏను వేరు చేస్తారు. ఆ తర్వాత దానిని డీఎన్ఏగా మార్చుతారు. పేపర్ను జిరాక్స్ తీసినట్టుగా ఆ డీఎన్ఏను కాపీ చేసి రెట్టింపు చేస్తారు. అంటే ఒక డీఎన్ఏను రెండు డీఎన్ఏలుగా.. రెండు డీఎన్ఏలను నాలుగు డీఎన్ఏలుగా మార్చుకుంటూ పోతారు. ఒక్కసారి డీఎన్ఏల సంఖ్యను రెట్టింపు చేయడాన్ని ఒక సైకిల్గా పేర్కొంటారు. గరిష్ఠంగా 35 సైకిల్స్ చేస్తారు. అంటే 35 సార్లు డీఎన్ఏల సంఖ్యను పెంచుతారు. ప్రతి సైకిల్ పూర్తయిన తర్వాత యంత్రం ఆటొమెటిక్గా డీఎన్ఏలను పరీక్షించి కొవిడ్-19 జన్యుపదార్థం ఉన్నదో లేదో గుర్తిస్తుంది. ఇలా చేస్తున్న క్రమంలో ఎన్నో సైకిల్ వద్ద కొవిడ్-19 జన్యుపదార్థాన్ని గుర్తిస్తారో.. దానిని సీటీ వాల్యూగా పేర్కొంటారు. 35 సైకిళ్ల వరకు జన్యుపదార్థం కనిపించకపోతే నెగెటివ్గా పేర్కొంటారు. సాధారణంగా 24-35 సైకిళ్ల మధ్య వైరస్ను గుర్తిస్తే పాజిటివ్గా నిర్ధారిస్తారు. 24 కన్నా తక్కువ సీటీ వాల్యూ ఉంటే వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నదని అర్థం. దీని కచ్చితత్వం 70 శాతం. అయితే కొన్నిసార్లు వైరస్ అతి తక్కువ పరిమాణంలో శరీరంలోకి చేరినప్పుడు.. దాన్ని రోగనిరోధక శక్తి ఎదురించడం వల్ల చనిపోతుంది.