ఆర్టీసీ నూతన ఎండీ సజ్జనార్
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నష్టాల బాటలో ఉన్న టీఎస్ఆర్టీసీని గట్టెక్కించి, సంస్థకు పూర్వవైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తానని టీఎస్ఆర్టీసీ నూతన ఎండీ వీసీ సజ్జనార్ చెప్పారు. బస్భవన్లో శుక్రవారం ఆయన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. సంస్థ స్వావలంబన, ప్రయాణికుల సంతృప్తి, ఉద్యోగుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు. తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్ఆర్టీసీకి కరోనా పరిస్థితులు, పెరిగిన డీజిల్, విడిభాగాల ధరలు శరాఘాతంగా మారాయని, దీంతో రోజుకు రూ.8 కోట్ల నష్టం వస్తున్నదని చెప్పారు. అధికారులు, సిబ్బంది సహకారంతో ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లించేందుకు తనవంతు కృషి చేస్తానని సజ్జనార్ చెప్పారు. వర్క్ఫ్లేస్లో మహిళా అధికారుల వేధింపులకు పరిష్కారంగా అంతర్గతంగా ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్టీసీ ప్రస్తుతం నిర్వహిస్తున్న కార్గో, పార్శిల్ సేవలతోపాటు ప్రధాన ఆదాయ వనరు అయిన టికెటింగ్ ఆదాయాన్ని పెంచే మార్గాలపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని తెలిపారు. కాగా, నూతన ఎండీ సజ్జనార్కు బస్భవన్లో భారీ కటౌట్లతో పూల బొకేలతో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
సజ్జనార్కు మంత్రి పువ్వాడ అభినందన
ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన వీసీ సజ్జనార్ టీఎస్ఆర్టీసీ అభ్యున్నతి కోసం కృషి చేయాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కోరారు. ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వీసీ సజ్జనార్ రవాణాశాఖ కార్యాలయంలో మంత్రిని కలిశారు. సజ్జనార్ను అభినందించిన పువ్వాడ.. పలు కీలక పోస్టులను సమర్థంగా నిర్వహించి పేరు గడించిన సజ్జనార్ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటారనే నమ్మకం తనకు ఉందని అన్నారు. ఇందుకు సజ్జనార్ స్పందిస్తూ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తానని చెప్పారు. ఇప్పటివరకు సంస్థ ఎండీగా అధనపు బాధ్యతలు నిర్వహించిన ఆర్అండ్బీ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మను శాలువతో సతరించారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఈడీ (రెవెన్యూ, ఐటీ), సంస్థ కార్యదర్శి పురుషోత్తం, ఈడీలు యాదగిరి, వినోద్ , వెంకటేశ్వర్లు , మునిశేఖర్, ఆర్థిక సలహాదారు రమేశ్, కార్గో ప్రత్యేక అధికారి కృష్ణకాంత్, రీజినల్ మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.