హైదరాబాద్, జూలై 1, (నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ తన కార్గో సేవలను శంషాబాద్ విమానాశ్రయానికి విస్తరించింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు గురువారం రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాంగణంలో కార్గో సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్గో , పార్సిల్ సర్వీసుల విభాగం ప్రత్యేక అధికారి ఎస్ కృష్ణకాంత్ మాట్లాడుతూ, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్శర్మ ఆధ్వర్యంలో ఏడాదికాలంగా పార్సిల్, కార్గో సేవలు విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి పార్సిల్ వస్తువులను విమానాశ్రయానికి చేరవేస్తున్నామని చెప్పారు. త్వరలోనే స్పైస్జెట్, ఇండిగో ఎయిర్లైన్స్తో ఒప్పందం చేసుకోనున్నట్టు వెల్లడించారు. కార్గో, పార్సిల్ సేవల ద్వారా వస్తున్న ఆదాయం క్రమంగా పెరుగుతున్నదని , మొదటి సంవత్సరం రూ. 30 కోట్ల్లు టార్గెట్గా పెట్టుకోగా రూ.46 కోట్లు ఆర్జించామని తెలిపారు. ఈ ఏడాది రూ.75 కోట్ల లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. హైదరాబాద్లో ఇప్పటికే డోర్ డెలివరీ సేవలు అందిస్తున్నామని, ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే ఆలోచన చేస్తున్నామని కృష్ణకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ (హైదరాబాద్) సీహెచ్ వెంకన్న , డీవీఎం(చార్మినార్) రాములు, ఏటీఎం-3 ఇషాక్ బిన్ అహ్మద్, రాజేంద్రనగర్ డిపో మేనేజర్ చంద్రకాంత్, జీఎమ్మార్ లాజిస్టిక్స్కు చెందిన రాజేశ్, మారెటింగ్ ఎగ్జిక్యూటివ్లు పాల్గొన్నారు.