హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): మాజీ సైనికుల సంక్షేమానికి వినూత్న పథకాలను అమలుచేయడంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలువాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ పేర్కొన్నారు. శనివారం రాజ్భవన్లో సైనిక దళాల ఫ్లాగ్ డే ఫండ్ మూడో రాష్ట్రస్థాయి మేనేజింగ్ కమిటీ సమావేశం గవర్నర్ అధ్యక్షతన జరిగింది. సైనికుల సంక్షేమానికి ఆదిలాబాద్, కొత్తగూడెంలలో సైనిక్భవన్లను నిర్మించాలని, ఇందుకు రూ.20 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయించారు. మాజీ సైనికులు మరణిస్తే వారికి పెండ్లికాని పిల్లలు ఉన్నా, వారిపై ఆధారపడిన నిరుద్యోగులైన పిల్లలు ఉన్నా రూ.2 లక్షల సాయం అందించాలని నిర్ణయించారు. మాజీ సైనికుల అమ్మాయిల పెండ్లికి ఇచ్చే గ్రాంట్ను రూ.30 వేల నుంచి రూ.40 వేలకు పెంచాలని, విద్యకు అందించే సాయాన్ని సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, పీహెచ్డీలకు కూడా అమలుచేయాలని, వృత్తి విద్యా కోర్సులకు అందించే సాయాన్ని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలని నిర్ణయించారు. ఆత్మనిర్బర్ కింద రాజ్భవన్లో స్వయం ఉపాధికి శిక్షణ ఇవ్వనున్నట్టు, ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేయాలని సైనిక అధికారులకు గవర్నర్ సూచించారు. సైనిక దళాల ఫ్లాగ్ డే ఫండ్ను ఏ విధంగా పెంచుకోవచ్చనే దానిపై అధ్యయనానికి కమిటీని ఏర్పాటుచేస్తామని సీఎస్ సోమేశ్కుమార్ తెలిపారు. సమావేశంలో హోం శాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, ఆర్థికశాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఆర్కే సింగ్ పాల్గొన్నారు.