కరోనాతో ఆరుగురి మృత్యువాత
8,746 మందికి అందుతున్న చికిత్స
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ)/బడంగ్పేట: రాష్ట్రంలో ఆదివారం 43,070 నమూనాలను పరీక్షించగా, 1,097 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 302 కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 138, రంగారెడ్డిలో 116, సంగారెడ్డిలో 52, నిర్మల్లో 42, కరీంనగర్లో 38, వరంగల్ అర్బన్లో 28 కేసులు నమోదైనట్టు సోమవారం బులెటిన్లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఆరుగురు మృతిచెంచారు. 8,746 మంది దవాఖానలు, హోంఐసొలేషన్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం మంచిర్యాల జిల్లాలో 917 మందికి పరీక్షలు నిర్వహించగా, 106 మందికి పాజిటివ్గా తేలింది. ఏపీలో ఆదివా రం 30,678 వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయ గా, 1,326 మందికి పాజిటివ్గా తేలింది. కరోనా నియంత్రణకు రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ఆటో డ్రైవర్ షఖిల్ ఆటోకు మాస్కులు కట్టుకొని ప్ర చారం నిర్వహిస్తున్నారు. ఆటో ఎక్కినవారికి మాస్క్ లేకపోతే ఉచితంగా అందజేస్తున్నారు. కాగా, రెండో దఫా కొవిడ్ వ్యాక్సినేషన్లో భాగంగా ఆదివా రం 31,263 మందికి తొలిడోస్ వేశారు. 4,045 మందికి రెండోడోస్ వేశారు.
వైరస్తో వైద్యుడి చికిత్స.. దవాఖాన సీజ్
ఖలీల్వాడి: నిజామాబాద్లోని నిష్కల్ న్యూరో మల్టీ స్పెషాలిటీ దవాఖాన యజమాని డాక్టర్ నిష్కల్ ప్రభుకు కరోనా సోకినా సాధారణ రోగులకు చికిత్స అందిస్తున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు జరిపి దవాఖాన సీజ్చేశారు. 30 మంది సిబ్బందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 10 మందికి పాజిటివ్గా తేలింది. నిష్కల్ ప్రభుకు కొవిడ్ టెస్టు చేయబోగా ఆయన తప్పించుకున్నారు.
మహగాంలో లాక్డౌన్
భైంసా టౌన్: నిర్మల్ జిల్లా భైంసా మండలం మ హగాంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహగాం పీహెచ్సీ వైద్యసిబ్బంది గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించగా, ఇప్పటివరకు 20 మందికి పాజిటివ్ వచ్చింది. వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, సర్పంచ్ అప్పాల రాకేశ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి.. బుధవారం వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటించాలని నిర్ణయించారు. దీంతో ఆదివారమే నిత్యావసర సరుకులు తీసుకున్నారు. పెండ్లి వేడుక కోసం కొందరు మహారాష్ట్రకు వెళ్లిరాగా, వారికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం.