బంజారాహిల్స్, ఏప్రిల్ 16: ‘చిన్నారికి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. చికిత్స అందించేందుకు డబ్బుల్లేవు. దాతలు సాయం చేస్తే పాప ప్రాణం నిలబడుతుంది’అంటూ చికిత్స పొందుతున్న ఫొటోలు, వీడియో చూపించి రూ.16.5 లక్షలు వసూలుచేశారు మోసగాళ్లు. చిన్నారి తల్లిదండ్రులకు కూడా తెలియకుండానే నొక్కేశారు. ఎట్టకేలకు విషయం తెలిసిన చిన్నారి తల్లిదండ్రులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెంకు చెందిన కిలార్ సతీశ్,నాగమ్మ దంపతుల పెద్ద కుమార్తె చైత్ర(6) కొన్నిరోజుల కిందట ఇంట్లో దీపానికి తగిలి మంటలంటుకుని తీవ్రంగా గాయపడింది. హాలియా, నల్లగొండలోని దవాఖానల్లో చేర్పించగా, మెరుగైన చికిత్స కోసం మార్చి 1న బంజారాహిల్స్లో ప్రముఖ చిన్నపిల్లల దవాఖానకు తీసుకొచ్చారు. చికిత్స కోసం రూ.9 లక్షలు ఖర్చుచేశారు. మరో సర్జరీ చేయాలని, రూ.20 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తేల్చిచెప్పారు. డబ్బు కోసం కుటుంబసభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. దవాఖానలో చిన్నారి ఫొటోలు, వీడియోలను తీసుకున్న గుర్తుతెలియని వ్యక్తులు చికిత్సకోసం సాయం అందించాలని ‘మిలాప్’ పేరుతో ఓ యాప్లో రిక్వెస్ట్ పెట్టారు. ఒబేదుల్లా పేరుతో ఉన్న ఖాతాలోకి డబ్బు పంపించాలని నకిలీఖాతా తెరిచారు. రెండు ఖాతాల్లోకి రూ.16.5 లక్షల వరకు జమయ్యాయి. ఈ విషయంపై చైత్ర కుటుంబసభ్యులకు ఎలాంటి సమాచారం లేదు. డబ్బులకు ఇబ్బంది అవుతున్నదని చైత్ర తల్లిదండ్రులు చెప్పగా.. ‘యాప్ ద్వారా వచ్చిన డబ్బు ఏమైంది’ అని దవాఖానవర్గాలు ప్రశ్నించాయి. షాక్కు గురైన చిన్నారి కుటుంబసభ్యులు.. తమకు తెలియకుండానే పాప పేరుతో సాయంకోరారని, ఈ నెల 12న ఒబేదుల్లాపై సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం పాపకు సర్జరీ చేయకపో గా, చైత్రను డిశ్చార్జి చేస్తున్నామని దవాఖానవర్గాలు ఒత్తిడి తెస్తున్నాయని చిన్నారి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. పాప పేరిట వచ్చిన సాయం వ్యవహారంలో అనుమానాలున్నాయని మీడియా వద్ద వాపోయారు.