హైదరాబాద్ : స్వచ్చంద సంస్థ పేరుతో ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన హైదరాబాద్ మల్కాజ్గిరిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ జే.అశోక్ కుమార్ తన సిబ్బందితో రాత్రి పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓమ్నీ వ్యాన్లో గుర్తు తెలియని వ్యక్తులు ఆక్సిజన్ను అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది. మౌలాలీ, ఈసీఐఎల్ వైపు వెళ్తున్నట్లు సమాచారం.
దీంతో ఎస్వోటీ బృందంతో కలిసి ఎస్ఐ వాహన తనిఖీలు చేపట్టారు. ఓమ్నీ వ్యానును తనిఖీ చేయగా ఐదు ఆక్సిజిన్ సిలిండర్లు ఒక్కోటి 150 లీటర్ల సామర్ధ్యం కలిగినవి కనుగొనబడ్డాయి. డ్రైవర్ సయీద్ అబ్దుల్లా(30), మహ్మద్ మజార్(37), జీఎం చౌనీ ఆక్సిజన్ సరఫరాకు సంబంధించి డాక్యుమెంట్లు చూపించడంలో విఫలమయ్యారు. వెంటనే వ్యాన్తో పాటు ఆక్సిజన్ సిలిండర్లు, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒక్కో సిలిండర్ను రూ.16 వేలకు కొనుగోలు చేసి ఆక్సిజన్ అవసరం ఉన్న రోగులకు రూ.25 వేలకు అమ్ముతున్నారు.
డీసీపీ సురేందర్రెడ్డి నేతృత్వంలోని ఎస్వోటీ బృందం, ఎస్ఐ అశోక్ కుమార్, సిబ్బంది నారాయణ రావు, ఎస్.లాల్య, సందీప్ కుమార్లను రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.