హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ సబ్సిడీపై ఆక్సిజన్ ప్లాంట్లు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు, లిక్విడ్ ఆక్సిజన్, వెంటిలేటర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు త్వరలో ముగుస్తున్నది. కరోనా సెకండ్ వేవ్లో ఆక్సిజన్కు ఏర్పడిన కొరతను దృష్టిలో ఉంచుకొని, ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టేవారికి పెట్టుబడిలో 30 శాతం లేదా గరిష్ఠంగా రూ.కోటి వరకు సబ్సిడీ ఇవ్వనున్నట్టు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీనితోపాటు జనరల్ క్యాటగిరీ వారికి టీ-ఐడియా (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూవర్ అడ్వాన్స్మెంట్), ఎస్సీలకు టీ-ప్రైడ్ (తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూవర్స్) కింద ఇచ్చే రాయితీలను యథావిధిగా కొనసాగించనున్నట్టు పేర్కొంది. ఈ నెలాఖరులోగా ఉత్పత్తి ప్రారంభించేవారికి సబ్సిడీ పథకం వర్తిస్తుంది. అయితే, వీటి ఏర్పాటుకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఇప్పటికైనా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకొని రాయితీలు వర్తింపజేస్తామని చెప్తున్నారు.