న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తాను చాలా క్రీయాశీలంగా వ్యవహరిస్తానని గత నెల టీఎంసీకి రాజీనామా చేసి, ఇవాళ బీజేపీలో చేరిన సీనియర్ నేత దినేశ్ త్రివేది చెప్పారు. బీజేపీలో చేరిన అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానా లేదా అనేది అనవసరమని, అయితే ఎన్నికల ప్రక్రియలో మాత్రం క్రీయాశీల పాత్ర పోషిస్తానని చెప్పారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీని బెంగాల్ ప్రజలు తిరస్కరించారని దినేశ్ త్రివేది వ్యాఖ్యానించారు. బెంగాలీలు అవినీతిని, హింసను కోరుకోవడం లేదని, అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నిజమైన మార్పు కోసం బెంగాలీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాజకీయాలు అంటే ఆటలు కాదని త్రివేది పేర్కొన్నారు. ఆమె (బెంగాల్ సీఎం మమతాబెనర్జిని ఉద్దేశించి) రాజకీయ క్రీడలోపడి తన లక్ష్యాలను మరిచిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.