కుత్బుల్లాపూర్ గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్
అసైన్డ్ భూములను కాపాడాలని ఆదేశం
కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన
పూడూరు,ఏప్రిల్ 28: గ్రామ పంచాయతీల్లో స్థలాలను గుర్తించి శ్మశానవాటికల నిర్మాణాలు చేపట్టే బాధ్యత సర్పంచ్లపైనే ఉందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు పేర్కొన్నారు. బుధవారం పూడూరు మండలం కుత్బుల్లాపూర్ గ్రామ పంచాయతీలో శ్మశానవాటిక నిర్మాణ పనుల కోసం కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని అసైన్డ్ భూముల్లో ఇతరులు కబ్జాలో ఉండడంతో పాటు సరైన దారి లేక శ్మశానవాటిక నిర్మాణం పనులను ఇప్పటి వరకు ప్రారంభించలేదు. గతసంవత్సరం నుంచి అధికారులు స్థల పరిశీలన చేసి నిర్మాణం కోసం కేటాయించినా, గ్రామంలో ఇరువర్గాల మధ్య ఉన్న స్థలాల వివాదంతో పనులను ప్రారంభించలేదు. దీంతో బుధవారం జిల్లా కలెక్టర్ పౌసుమి బసు గ్రామా న్ని సందర్శించి గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించి ఉన్న స్థలంలోనే శ్మశానవాటిక నిర్మించాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ పరిధిలోని పలు చోట్ల ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి తమకు నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. పంచాయతీ పరిధిలోని అసైన్డ్ భూములను కాపాడాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డు పక్కనే ఉన్న స్థలంలో నిర్మాణం చేపట్టాలన్నారు. అసైన్డ్ భూముల్లో నుంచి రైతుల పొలాలకు వెళ్లేందుకు దారి చూయించాలని కలెక్టర్కు రైతులు వినతి పత్రం అందజేశారు. శ్మశానవాటిక నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించి పూర్తి చేయాలని సర్పంచ్ పాపయ్య, ఎంపీడీవో ఉషను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం నిర్మించిన డంపింగ్ యార్డును పరిశీలించారు.కరోనా బారిన పడకుండా అందరు సా మాజిక దూరం పాటించాలన్నారు. కలెక్టర్ వెంట పీఆర్ డీఈ సుదర్శన్రెడ్డి, ఈవోఆర్డీ, ఆర్ఐ బాల్రాజ్, ఎంపీటీసీ ఆరిఫ్, ఎస్సై శ్రీశైలం తదితరులు ఉన్నారు.