అంతన్నాడింతన్నాడే రాజేంద్ర..! రైతుబంధు నాకన్నాడే రాజేంద్రా..!!
రైతుబంధు పథకంలో ధనికరైతు ఈటల
కుటుంబసభ్యుల ఖాతాలో మూడేండ్లుగా రైతుబంధు జమ
2018 దేవరయాంజాల్ 65.10 2,61,000
2019 దేవరయాంజాల్ 22.04 1,10,500
2020 దేవరయాంజాల్ 65.10 6,52,500
మొత్తం: 10,24,000
రాజేంద్రుడి సుత్తి ముక్తావళి
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను చెల్లించేవారికి, ధనవంతులకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేయవద్దని సీఎం కేసీఆర్కు చెప్పానంటున్న ఈటల.. ఇప్పటిదాకా కుటుంబసమేతంగా పంటసాయం పొందుతున్నారు. మూడేండ్లలో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురి ఖాతాల్లో రూ.10.24 లక్షలు ప్రభుత్వం నుంచి జమ అయ్యాయి. పుట్టు కోటీశ్వరుడిగా చెప్పుకుంటున్న ఈటల ఏటా రూ.3 లక్షలు ఎలా తీసుకుంటున్నాడని.. ఏనాడైనా వాటిని వద్దన్నాడా? అని సొంత నియోజకవర్గం హుజూరాబాద్ రైతులే ప్రశ్నిస్తున్నారు. ఈటలలో నీతి, నిజాయితీ లోపించిందని చెప్పడానికి అనేక ఉదాహరణలున్నాయని చెప్తున్నారు. రైతుబంధు పథకాన్ని ప్రకటించిన సందర్భంగా వందల మంది నిజాయితీపరులు తమకు పెట్టుబడి సాయం అవసరంలేదని.. తమకు వచ్చే రైతుబంధు చెక్కులను తిరిగి ఇచ్చేస్తున్నామంటూ ప్రభుత్వానికి లేఖలు సమర్పించారు. ఒకస్థాయి నేతలనుంచి మొదలు సామాన్య రైతులదాకా తమకు వచ్చిన రైతుబంధు చెక్కులను ‘గివ్ ఇట్’ కింద స్థానిక వ్యవసాయాధికారులకు తిరిగిఇచ్చేశారు.
మూడేండ్లలో పది లక్షలకుపైగా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం దేవరయాంజాల్లో ఈటల రాజేందర్ కుటుంబసభ్యుల పేరిట ఉన్న 65 ఎకరాల భూమికి రైతుబంధు అందుతున్నది. ఈటలతోపాటు, భార్య జమున, కుమారుడు నితిన్రెడ్డి ఖాతాల్లో 2018 నుంచి రైతుబంధు నిధులు జమ అవుతున్నాయి. ఇప్పటిదాకా రూ.10.24 లక్షలు పంట సాయం అందింది. కానీ, ముగ్గురు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరి ఖాతాల్లో మూడు లక్షల రూపాయల చొప్పున మూడేండ్లుగా జమ అవుతున్నా.. ఈటల రాజేందర్ ఒక్కసారి కూడా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వలేదు. తనకు పంటసాయం వద్దని చెప్పలేదు. మూడు దశాబ్దాల నుంచే వ్యాపారరంగంలో ఉన్నానని.. అప్పటికే తాను కోటీశ్వరుడినని చెప్పుకుంటున్న ఈటల.. రైతుబంధు సాయాన్ని తిరిగి ఇచ్చి మిగిలిన పెద్ద, ఇన్కంటాక్స్ చెల్లించే రైతులకు ఎందుకు ఆదర్శంగా నిలవకలేకపోయారో చెప్పాలనే డిమాండ్ వస్తున్నది. మీడియా ముందు నీతులు చెప్పడం, ఉదాత్తవాదినని, పేదల గురించి ఆలోచించే వ్యక్తినని చెప్పడం ‘కోడలుకు నీతులు చెప్పిన అత్తా ఏదో చెసింది అన్నట్టుగా ఉన్నదని’ ఎద్దేవా చేస్తున్నారు.
ప్రపంచంలోనే ఉత్తమం రైతుబంధు
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుబంధు ప్రపంచంలోనే ఉత్తమ పథకంగా ఐక్యరాజ్యసమితిచే కీర్తించబడింది. పంటసాగు కోసం రైతుకు ఎకరానికి రూ.10వేల సాయం అందించే ఈ పథకాన్ని అనేక రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకున్నాయి. కొద్దిపాటి మార్పులతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పేరిట అమలుచేస్తున్నది. రాష్ట్రంలో 1.43 కోట్ల ఎకరాల భూమికి 58.33 లక్షల మంది రైతులకు ఏడాదికి రూ.10వేల చొప్పున తెలంగాణ ప్రభుత్వం రెండువిడుతలుగా పెట్టుబడి సాయం అందజేస్తున్నది. ఇందులో సన్న, చిన్నకారు రైతులే దాదాపు 98శాతం మంది ఉన్నారు. వీరిలో 5 ఎకరాలలోపు ఉన్న రైతులే 53 లక్షల మంది పెట్టుబడి సాయం పొందుతున్నారు. 5నుంచి 10 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులు 4.4 లక్షల మంది ఉన్నారు. 20 ఎకరాలకుపైగా ఉన్న పెద్ద రైతులు కేవలం 6,679 మంది మాత్రమే. కొద్దిమందిని దృష్టిలో పెట్టుకుని.. సన్న,చిన్నకారు రైతులకు ఉపయోగపడుతున్న రైతుబంధు పథకంపై విమర్శలు చేయడం ఈటల అవగాహనా రాహిత్యాన్ని తెలుపుతున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ పథకాలను విమర్శించిన ఈటల తాజాగా రైతుబంధు పథకంపై విమర్శలు చేయడాన్ని రాష్ట్ర రైతాంగం ఆవేదన వ్యక్తంచేస్తున్నది.
బ్యాంక్ ఖాతాలివ్వని భూములెన్నో..
ఈటలకు దేవరయాంజాల్లోనే కాదు.. ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల వందల ఎకరాల భూములున్నాయి. అయితే, ల్యాండ్సీలింగ్ యాక్ట్ కింద ఎక్కడ వస్తాయోననే భయంతో ఆ భూములకు రైతుబంధు తీసుకోలేదని తెలుస్తున్నది. ఈటల కుటుంబానికి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల పరిధిలో 32 ఎకరాలున్నాయి. తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో బినామీ పేర్లతో 110 ఎకరాలు కొన్నట్టు తెలిసింది. నుస్తులాపూర్ భూమికి అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో వాటిని అమ్మకానికి పెట్టినట్టు సమాచారం. మేడ్చల్ జిల్లా పరిధిలోని రావల్కోల్ గ్రామంలో కూడా 25 ఎకరాల వరకు భూమి ఈటల రాజేందర్ కుటుంబానికి ఉన్నది. ముందుచూపుతోనే ఈ భూములకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను వ్యవసాయశాఖకు సమర్పించలేదని సమాచారం. దీంతో వాటికి రైతుబంధు అందడంలేదు.