హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు స్కూల్ టీచర్లు, సిబ్బందికి ప్రభుత్వ అందించే 25 కిలోల సన్న బియ్యం ఆహార భద్రతా కార్డు/ రేషన్కార్డు లేకున్నా ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. టీచర్లు, సిబ్బంది నివాస ప్రాంతాలకు సమీపంలోని రేషన్షాపుల్లోనే బియ్యాన్ని అందజేయనున్నారు. చాలామంది ప్రైవేటు స్కూల్ సిబ్బందికి రేషన్కార్డులు లేవు. దరఖాస్తుల్లో భాగంగా రేషన్కార్డు/ ఆహార భద్రతా కార్డు నంబర్ ఎంటర్ చేయాలని నిబంధన పెట్టారు. దీంతో చాలామంది గందరగోళానికి గురై అధికారులను సంప్రదిస్తున్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా రేషన్కార్డు లేకున్నా 25 కిలోల బియ్యం అందజేయాలని ఆదేశాలిచ్చారు. సమీపంలోని రేషన్షాపు నంబర్ను దరఖాస్తుల్లో తప్పనిసరిగా పేర్కొనాలని అధికారులు సూచిస్తున్నారు.
దరఖాస్తుదారులు పేర్కొన్న రేషన్షాపుకే సన్న బియ్యం పంపిస్తామని తెలిపారు. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బంది ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఒక్కొక్కరికి నెలకు 25 కిలోల సన్న బియ్యం, రూ.2 వేల నగదు సాయంగా అందించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ సాయం కోసం మూడురోజుల్లోనే 1.25 లక్షల మంది దరఖాస్తు చేసుకొన్నారు. సోమవారం ఒక్కరోజే 65 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులకు మరో మూడురోజులు గడువు ఉన్నది. ఈ పథకం అమలుకు రూ.32 కోట్లు మంజూరుచేస్తూ విద్యాశాఖ స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ సోమవారం ఆదేశాలిచ్చారు. ఏప్రిల్ నెలకోసం ఈ నిధులను కేటాయించారు.
సన్నబియ్యం సిద్ధం చేయండి
టీచర్లు, సిబ్బందికి పంపిణీ చేసేందుకు సన్నబియ్యం సిద్ధంచేయాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. విద్యాశాఖ అధికారులతో కలిసి బియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. ఒక జిల్లాలో ఎక్కువ స్టాక్, మరో జిల్లాలో తక్కువ ఉంటే సర్దుబాటు చేసుకోవాలన్నారు. సన్నబియ్యం నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టంచేశారు. ఈ నెల 21 నుంచి ప్రైవేటు పాఠశాలల టీచర్లు, సిబ్బందికి సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.
మంచు విష్ణు హర్షం
కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రైవే టు పాఠశాలల సిబ్బందిని ఆదుకోవాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ఎంతో గొప్పదని సినీనటుడు మంచు విష్ణు అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఎంతగానో సంతోషిస్తున్నారని ఆయన సోమవారం ట్వీట్చేశారు. ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులకు సీఎంపై గౌరవం మరింత పెరిగిందని విష్ణు పేర్కొన్నారు.
ఇవీ కూడా చదవండి…
ఎన్ఆర్సీ తెచ్చినా.. గోర్ఖాలను వెళ్లగొట్టం
కేసీఆర్ కలను నిజం చేస్తున్నాం..