హైదరాబాద్ : గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైస్ మిల్లు యజమానులు చర్యలకు ఉపక్రమించారు. మరోసారి లాక్డౌన్ భయాందోళనల నేపథ్యంలో వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు యోచిస్తున్నారు. ఇదే జరిగితే కార్మిక కొరతకు దారితీసే అవకాశం ఉండటంతో రైస్ మిల్లు యాజమాన్యాలు ఉపశమన చర్యలు చేపట్టాయి.
తెలంగాణలోని మిల్లు యజమానులు ఉచిత మధ్యాహ్న భోజనం, ప్రత్యేక షెడ్లలో వసతి ఏర్పాట్లు, మాస్కులు, శానిటైజర్లను ఆఫర్ చేస్తున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లు యజమానులు ఉచిత బియ్యం, కూరగాయలు, ఫ్యాన్లు, ఏసీలతో కూడిన వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. బిహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి 1.5 లక్షలకు పౌగా వలస కార్మికులు తెలంగాణలోని 2,200 రైస్ మిల్లులో పనిచేస్తున్నారు. ధాన్యం, బియ్యం బస్తాలను లోడ్ చేయడం అదేవిధంగా అన్లోడ్ చేయడం ఎక్కువగా చేస్తుంటారు.
గతేడాది మహమ్మారి సమయంలో వేలాదిమంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు బయల్దేరివెళ్లారు. ఈ చర్య రైస్ మిల్లుల పనిని ప్రభావితం చేసింది. వారిని తిరిగి తీసుకువచ్చేందుకు రైలు ఛార్జీలతో పాటు ఇతర సౌకర్యాలను కల్పించాల్సి వచ్చిందన్నారు. లాక్డౌన్ భయాందోళన నేపథ్యంలో వారు ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుందని భయపడుతున్నారని మిర్యాలగుడ రైస్ మిల్లు యజమాని, మిర్యాలగుడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మంచు వెంకటేశ్వర్లు అన్నారు. అటువంటి పరిస్థితే ఎదురైతే వారిని అన్ని విధాలుగా బాగా చూసుకుంటారని హామీ ఇచ్చినట్లు చెప్పారు.
తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ మాట్లాడుతూ.. కొవిడ్ -19 పరిస్థితి మరింత దిగజారిపోతున్నందున వారు తమ కుటుంబాల వద్దకు తిరిగి వెళ్ళగలమా అని వారు ఆందోళన చెందుతున్నారన్నారు. వారి చర్చలన్నీ మహారాష్ట్ర పరిస్థితులు, నైట్ కర్ఫ్యూల గురించే ఉంటున్నాయన్నారు. ఏప్రిల్ 20 నుండి మే 1 వరకు తెలంగాణ ప్రభుత్వం రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించింది. లాక్డౌన్ను ఇది ముందు చర్యగా వలస కార్మికులు భావిస్తున్నారు. ఇది వారిలో ఆందోళనను పెంచిందన్నారు. అయితే రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్డౌన్ ఉండదని హామీ ఇచ్చారు, కార్మికులెవరూ భయపడొద్దని విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.