హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ సభ్యత్వాల డిజిటలైజేషన్, జిల్లా పార్టీ కార్యాలయాల నిర్మాణాల పురోగతి తదితర అంశాలపై చర్చించేందుకు బుధవారం టీఆర్ఎస్ కార్యనిర్వాహక కమిటీ సమావేశం కానున్నది. తెలంగాణభవన్లో వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 12న ప్రారంభమైన పార్టీ సభ్యత్వ నమోదు అనుకున్న సమయానికి పూర్తయినప్పటికీ.. కరోనా సెకండ్వేవ్, లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో డిజిటలైజేషన్ మధ్యలో నిలిచిపోయింది. సభ్యత్వాలు 70 శాతం డిజిటలైజ్ కాగా.. మిగిలిన 30శాతం త్వరగా పూర్తిచేసేలా పార్టీ శ్రేణులకు కేటీఆర్ గడువును నిర్ణయించే అవకాశాలున్నాయి. కార్యకర్తల బీమా వ్యవహారాలను చూసిన కావేటి లక్ష్మినారాయణ ఇటీవల గుండెపోటుతో మరణించటంతో ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్, వరంగల్ రూరల్ మినహా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టింది. సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రారంభించారు. మరో 23 జిల్లాల కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. మిగిలినవి కూడా తుదిదశకు చేరుకొన్నాయి. మరోవైపు ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేయాల్సి ఉన్నది. దానితోపాటు, రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో సాధ్యమైనంత త్వరగా కార్యాలయాల నిర్మాణం పూర్తిచేసేందుకు చేపట్టే కార్యాచరణపై కార్యనిర్వాహక సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అనుసరించే వ్యూహంపై కార్యనిర్వాహక సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్పై, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అదేపనిగా చేస్తున్న విమర్శలను బలంగా తిప్పికొట్టేలా కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు, సోషల్ మీడియా వారియర్స్ గ్రూప్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు.