ప్రత్యేక ప్రతినిధి, జూన్15 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ రాష్ట్ర ఖజానాపై ప్రతికూల ప్రభావం చూపింది. వరుస లాక్డౌన్ల వల్ల రాబడికి గండి పడింది. బడ్జెట్ అంచనా కంటే ఆదాయం దాదాపు 30 శాతం తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్లో కనీసంగా రూ.9 వేల కోట్ల రాబడి వస్తుందని అంచనావేయగా.. అది రూ.7,618 కోట్లకే పరిమితమైంది. మే నెలలో ఆదాయం అంచనా కంటే రూ.3 వేల కోట్ల వరకు తగ్గింది. మే నెలలో సొంతపన్నుల ద్వారా కేవలం రూ.6 వేల కోట్ల రాబడి సమకూరింది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), వాణిజ్య పన్నుల ద్వారా రూ.3,618.94 కోట్ల రాబడి వచ్చింది. పెట్రోల్, డీజిల్ అమ్మకాల ద్వారా రూ.975 కోట్లు, మద్యంపై వ్యాట్ వల్ల ద్వారా రూ.970 కోట్లు రాగా.. స్టేట్ జీఎస్టీ ద్వారా రూ.856 కోట్లు, ఐజీఎస్టీ ద్వారా రూ.764 కోట్లు సమకూరింది. ఏప్రిల్, మే నెలల్లో వాణిజ్య పన్నుల ద్వారా రూ.8,294 కోట్ల రాబడి మాత్రమే వచ్చింది.
ఇది బడ్జెట్ అంచనాల కంటే 30 శాతం తక్కువ. మిగతా రాష్ర్టాలతో పోలిస్తే జీఎస్టీ రాబడి కొంత మెరుగైనప్పటికీ రాష్ట్ర ఖజానాపై కరోనా ప్రభావం తీవ్రంగానే ఉన్నది. ఇక మద్యం అమ్మకాల ద్వారా ఏప్రిల్లో రూ.2,270 కోట్లు, గత నెలలో రూ.2,130 కోట్ల రాబడి వచ్చింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయానికి కూడా లాక్డౌన్ గండి కొట్టింది. వ్యవసాయ, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల ద్వారా ఏప్రిల్లో రూ.726 కోట్ల రాబడి రాగా.. మేలో రూ.236 కోట్లకు తగ్గింది.
సంక్షేమ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ , వేతన పెంపు వల్ల ఖజానాపై అదనపు భారం పడుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఆర్బీఐ అనుమతితో బాండ్ల వేలం ద్వారా మరో రూ.3 వేల కోట్ల రుణాన్ని సేకరించింది. 30 ఏండ్ల సుదీర్ఘకాలానికి ఈ బాండ్లను వేలం వేశారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో బాండ్ల ద్వారా రూ.10 వేల కోట్ల వరకు రుణం సమకూరింది.