న్యూఢిల్లీ: యుటిలిటీ, మల్టీ పర్పస్ వెహికల్స్ మినహా అన్ని రకాల వాహనాల విక్రయాలు ఇంకా ఊపందుకోకున్నా.. తొలిసారి ఒక ఆర్థిక సంవత్సరంలో యుటిలిటీ వెహికల్స్ విక్రయాలు 10 లక్షల మార్క్ను దాటనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యుటిలిటీ వెహికల్స్ సెగ్మెంట్లో గత నెలాఖరు వరకు 9,02,951 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో యుటిలిటీ వాహనాల సేల్స్ బేష్షుగా ఉందని, లేనిపక్షంలో ఆటోమొబైల్ పరిశ్రమ కష్టాల్లో చిక్కుకునేదని ఆటో ఇండస్ట్రీ బాడీ సియామ్ పేర్కొంది. 2020 ఏప్రిల్-2021 ఫిబ్రవరి మధ్య జరిగిన ఆటోమొబైల్ సేల్స్ ఆధారంగా సియామ్ ఈ వ్యాఖ్య చేసింది. గతేడాది ఏప్రిల్ నుంచి గత నెలాఖరు వరకు యుటిలిటీ విభాగం కార్ల విక్రయంలో అగ్రస్థానంలో మారుతి సుజుకి కొనసాగుతుండగా, తర్వాత హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా, టాటా మోటార్స్ నిలిచాయి.
గత 11 నెలల్లో ఇంకా ప్యాసింజర్ వెహికిల్స్ సేల్స్ 2019-20తో పోలిస్తే -10.35 శాతం తగ్గుముఖం పట్టాయి. వాటిల్లో ప్యాసింజర్ కార్ల సేల్స్ 16.20 శాతం తగ్గి 13,36,473 యూనిట్లకు పడిపోగా, వ్యాన్ల విక్రయాలు 23 శాతం పడిపోయి 96,384 యూనిట్లకు పరిమితం అయ్యాయి.
ఈ ఏడాదిలో యుటిలిటీ వెహికల్స్ సేల్స్ పది లక్షల యూనిట్లకు చేరుకోనున్న నేపథ్యంలో గతేడాది అక్టోబర్, నవంబర్, ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రతి నెలా లక్ష యూనిట్ల విక్రయాలు దాటాయి. మరో రెండు నెలల సేల్స్ లక్షకు చేరువలో ఉన్నాయి. గతేడాది (2019-20)లో యుటిలిటీ వాహనాల విక్రయాలు 9,46,010 యూనిట్లకు చేరాయి.