హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్వేవ్ ఉధృతంగా కొనసాగుతున్నప్పటికీ రాష్ట్రంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల జోరుమాత్రం తగ్గలేదు. ఏప్రిల్లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.717 కోట్ల రాబడి సమకూరింది. వ్యవసాయేతర ఆస్తులు 1.07 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వ్యవసాయ భూములకు సంబంధించి సుమారు 58 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్టు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్/ఐజీ శేషాద్రి తెలిపారు. మార్చి నెలాఖరుతో ముగిసిన 2020-21ఆర్థిక సంవత్సరానికి 5,600 కోట్ల రాబడి వచ్చినట్టు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని సబ్రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొవిడ్ నిబంధనలను పకడ్బందీగా పాటిస్తూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నారు.