మేడ్చల్, మే 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా రావల్కోల్ భూ కబ్జా వ్యవహారంపై రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు వేర్వేరుగా లోతైన విచారణ చేస్తున్నారు. బాధితుడు పిట్ల మహేశ్ నుంచి సేకరించిన పత్రాల ఆధారంగా రెవెన్యూశాఖలోని ఫైళ్లను పరిశీలిస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనయుడు నితిన్రెడ్డి రావల్కోల్లోని సర్వేనంబర్ 77లోని 10.11 ఎకరాల భూమిని చెరపట్టినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్కు బాధితుడు పిట్ల మహేశ్ ఫిర్యాదు చేసిన విషయం విదితమే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన విచారణ బుధవారం కూడా కొనసాగింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇంచార్జి కలెక్టర్ శ్వేతామహంతి నేతృత్యంలో కొనసాగుతున్న విచారణలో రెవెన్యూ అధికారులు 1975లో 38 (ఈ) సర్టిఫికెట్ జారీచేసిన ఫైళ్లపై ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు 38 (ఈ) సర్టిఫికెట్లకు సంబంధించిన ఫైల్ అందుబాటులో లేదని తెలుస్తున్నది. ఈ ఫైళ్లు లభ్యమైతే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నది. 76, 77, 78 సర్వే నంబర్లలో బాధితుడు పిట్ల మహేశ్ తాత నర్సింహతోపాటు మరో నాలుగురికి 38 (ఈ) సర్టిఫికెట్లు జారీ అయిన విషయం విదితమే. బాధితుడు మహేశ్ తాత నర్సింహ పేరు రికార్డులో మారిన తర్వాత వచ్చిన పేర్ల ఆధారంగా వివిధ పేర్లతో రిజిస్ట్రేషన్ అయిన పత్రాలను పరిశీలించారు. కాగా, సర్వే నంబర్ 77లోని 10.11 ఎకరాల భూమిపై ఏమైనా కేసులు ఉన్నాయా అని మేడ్చల్ తాసిల్దార్ గీత బాధితుడు పిట్ల మహేశ్ నుంచి బుధవారం వివరాలు సేకరించారు. భూమిపై ఎలాంటి కేసులు లేవని మహేశ్ వివరించారు. అవసరమైతే వివరాల సేకరణకు అందుబాటులో ఉండాలని మహేశ్కు తాసిల్దార్ సూచించారు.