ఒసోస్ ఆకాశం నుంచి దిగొచ్చాడయ్యా ఓ రీతిలేని నీతి మంతుడు! నోరు తెరిస్తే అబద్ధాలు, మాట మాటకూ కట్టుకథలు! జీవితమంతా పుచ్చులు, మచ్చలే.. బతుకంతా బట్టేబాజ్ పనులే! అయినా హరిశ్చంద్రుడికి హైదరాబాద్ తమ్ముడిలా ఫోజు. భూ దందాలంటే ఆయనకెంతో మోజు. ఆయన పేరు రేవంత్రెడ్డి!
నాన్ వర్కింగ్ కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా చెప్పుకొనే రేవంత్కు అకస్మాత్తుగా ఎందుకు ముచ్చెమటలు పడుతున్నాయి? దేవరయాంజాల్ భూములపై ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే.. రేవంత్ ఎందుకు ఎండిన రేగ్గాయలా ఎగిరిపడుతున్నాడు? ఎండోమెంట్ భూములపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంటే రేవంత్ ఎందుకు ఎదురుదాడి చేస్తున్నాడు? తమ కేబినెట్లోని ఒక మంత్రిపై వచ్చిన ఆరోపణల మీద ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తుంటే, అభినందించాల్సింది పోయి రేవంత్ ఎందుకు ఎగిరెగిరి మొరుగుతున్నట్టు? తన భూములేవో పోతున్నట్టు ఎందుకు ఉలిక్కి పడుతున్నట్టు? గట్లెంబడి, గుట్టలెంబడి ఎందుకు ఉరుకుతున్నట్టు? ఎందుకు ఉరుకులాడుతున్నట్టు? సమ్థింగ్ ఈజ్ దేర్. ఏదో ఉంది. దాల్ మే కుచ్ కాలా హై!
దేవరయాంజాల్లోని దేవాదాయ భూములన్నింటిపైనా విచారణ జరపాలని కేసీఆర్ ఆదేశించారు తప్ప, కొన్నింటిని మినహాయించాల్సిందిగా ఎక్కడా చెప్పలేదు. మొత్తం కొలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సర్వే జరుగుతున్నది. తప్పు చేసిన వాళ్లకు కమిటీ నోటీసులు ఇస్తుంది. అంతలోనే రేవంత్కు ఆగమెందుకు? గాయి గత్తరెందుకు? ఒకవేళ నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ భూములపై ఎవరికైనా అనుమానాలు ఉంటే, ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ల కమిటీకి నిరభ్యంతరంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. కమిటీ దీనిపై ఎలాంటి విచారణనైనా చేసుకోవచ్చు. ఇందుకు టీపీపీఎల్ యాజమాన్యం పూర్తిగా సహకరిస్తుంది. భూమి విషయంలో అక్రమాలు ఉన్నాయని రుజువైతే ప్రభుత్వం నిర్దంద్వంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అవి దేవాదాయ శాఖ భూములని తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, వాటిని పేద ప్రజలకు పంచిపెట్టవచ్చు.
హైదరాబాద్, మే 6 నమస్తే తెలంగాణ : ‘నీతి లేని వాడు కోతి కంటే పాడు’ అనే సామెత రేవంత్రెడ్డికి అచ్చంగా అతుకుతుంది. తన మంత్రివర్గంలోని సభ్యుడైన ఈటల రాజేందర్పై రైతులు భూ కబ్జా ఆరోపణలు చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనపై విచారణకు ఆదేశించారు. మంత్రివర్గం నుంచి తొలగించారు. ఈటల ప్రమేయమున్నట్టుగా ఆరోపణలున్న దేవరయాంజాల్ దేవాదాయ భూములపైనా నలుగురు ఐఏఎస్లతో కమిటీ వేసి సమగ్ర విచారణకు ఆదేశించారు. అంతే… రేవంత్రెడ్డికి కంటిమీద కునుకు కరువైంది. యాంజాల్ దేవర సీతారామస్వామి కల్లోకి వచ్చి కత్తిదూసిండో, భూముల దయ్యమేదైనా భయపెట్టిందో తెల్వదుగానీ, రేవంత్ మనసు మనసుల ఉంటలేదు. కాలు నేల మీద నిల్వడం లేదు. తన పార్టీకి చెందిన మంత్రిపై ముఖ్యమంత్రి చర్య తీసుకుంటే రేవంత్ గుండెందుకు గుబగుబలాడుతున్నదో, ఎందుకు పిచ్చిపట్టినట్టు చేస్తున్నడో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. రేవంత్ గురువారం నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ భూముల్లో అక్రమాలంటూ కొత్త పాట మొదలుపెట్టాడు. అసలే కోతి, ఆపై కల్లుతాగి, నిప్పు తొక్కిందన్నట్టు… అసలే రేవంత్, ఆపై అయోమయం, ఏదో తెల్వని ఆక్రోశం!
ఇదీ ఆరంభం..
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడక ముందే… 2011 జూన్ 6న ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రారంభమైంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి విఘాతం కలిగిస్తున్న ఆంధ్రా మీడియాను, ప్రతీఘాత శక్తులను బట్టలిప్పి, బరిమాతల బజారులో నిలబెట్టడమే ధ్యేయంగా నమస్తే తెలంగాణ ప్రారంభమైంది. అప్పుడు రేవంత్… తెలంగాణకు పచ్చి వ్యతిరేకి, పచ్చబాస్ చంద్రబాబు చెప్పులు మోస్తూ ఉండేవాడు. బాబు పంచన బతుకుతూ, తెలంగాణపై వంచనలో పాలుపంచుకునేవాడు. ఉమ్మడి రాష్ట్రంలో మన పరిస్థితి ఎలాంటిదంటే… ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నిర్వహించాలని నిర్ణయించిన కేసీఆర్, ట్యాంకుబండు పక్కన ఉన్న జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీని ప్రారంభించారు. అక్కడే పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్ అటు మళ్లగానే చంద్రబాబు దొంగరాత్రి టీఆర్ఎస్ ఆఫీసును కూలగొట్టించాడు. టీఆర్ఎస్కు ఎవరూ కిరాయికి కూడా ఇల్లివ్వకుండా బెదిరింపులకు దిగాడు.
ఇక 2011లో నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభించినప్పుడు ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి. అధికారంలో ఉన్నది కాంగ్రెస్. కిరణ్కుమార్రెడ్డికి తెలంగాణపై ఎంత ద్వేషమంటే, తెలంగాణ వాడు కనబడితే కరిచేంత! ఉద్యమాన్ని, టీఆర్ఎస్ను అణచివేయడానికి కిరణ్కుమార్రెడ్డి ప్రభుత్వం ఎలా ప్రయత్నించిందో ప్రతి తెలంగాణ సోదరుడికీ తెలుసు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం నమస్తే తెలంగాణ పత్రిక పెట్టుకుందామని ప్రయత్నిస్తే, ఆఫీసు దొరకకుండా కుట్రలు చేసింది ఆనాటి సర్కారు. ఎవరూ కిరాయికి ఆఫీసు ఇవ్వకుండా బెదిరించింది. బ్లాక్మెయిల్ చేసింది.ఆ సమయంలో నమస్తే తెలంగాణకు ప్రింటింగ్ ప్రెస్ కోసమని, యాజమాన్యమైన తెలంగాణ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీపీపీఎల్) 2011 జనవరి 5న దేవరయాంజాల్లో ఎకరం భూమిని కొనడం జరిగింది.
హైదరాబాద్లో కిరాయికి ఆఫీసు పట్టుకోవడానికే కష్టపడ్డ టీఆర్ఎస్గానీ, నమస్తే తెలంగాణ పత్రిక గానీ… ఆ రోజున్న పరిస్థితుల్లో… చంద్రబాబు, కిరణ్కుమార్రెడ్డి ఉమ్మడిగా ఉద్యమంపై కుట్రలు చేస్తున్న సమయంలో.. దేవర యాంజాల్లో ఎకరా భూమిని కబ్జా పెట్టడం, దేవుడి భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడం అయ్యే పనేనా? ఒకవేళ కబ్జా పెడితే ఊరుకొనేదా కిరణ్కుమార్ ప్రభుత్వం! దేవుడి భూమిని కొంటే రిజిస్ట్రేషన్ చేసుకోనిచ్చేదా సర్కారు! మెడమీద తలకాయ ఉండే మాట్లాడుతున్నడా రేవంత్రెడ్డి! ఆ తర్వాత 2015లో రెండెకరాల 8 గుంటలు, 2015లో (రిజిస్ట్రేషన్ జరిగింది 2019లో) ఎకరా ఆరుగుంటలు కొనుగోలు చేసింది టీపీపీఎల్.
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికల యాజమాన్యమైన టీపీపీఎల్కు, ప్రింటింగ్ ప్రెస్ అవసరాల కోసం, దేవర యాంజాల్లో మొత్తమ్మీద ఉన్నది నాలుగు ఎకరాల 14 గుంటలు. ఈ భూమి అంతా టీపీపీఎల్ ప్రతినిధి (సీఎండీ) దీవకొండ దామోదర్రావు పేరిట ఉంది. రేవంత్ చెప్పినట్టు టీపీపీఎల్కు ఉన్నది 10-15 ఎకరాలు కానే కాదు. ‘నమస్తే తెలంగాణకు చెందిన భూములు చూపించిన’ అని చెబుతున్న రేవంత్కు, నాలుగెకరాల భూమి ఎంతుంటదో, దానికి నాలుగింతలైన పదిహేను ఎకరాల భూమి ఎంతుంటదోకూడా తెలియదా? అయినా కండ్ల తోనే కొలిచి కరెక్టుగా చెప్పడానికి రేవంత్కు భూముల విషయంలో అంత అనుభవం ఉందా? ఉందనుకున్నాడేమో… పొద్దున లేస్తే అదే దందా కదా!
పూర్తిగా పట్టా భూమి
ఎండోమెంట్ ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న భూమిని టీపీపీఎల్ కొనుగోలు చేసిందని రేవంత్ అంటున్నడు. నమస్తే తెలంగాణ భూములున్నది 437 సర్వే నంబరులో! ఈ సర్వే నెంబర్లో మొత్తం 10 ఎకరాల 37 గుంటల భూమి ఉంది. ఇదంతా కట్టా బాల్రెడ్డి, కట్టా అంజిరెడ్డి, కట్టా నర్సింహారెడ్డి, కట్టా లక్ష్మారెడ్డి పేరిట ఉంది. వీరి వారసుల నుంచి ఈ భూమిపై క్రయ విక్రయాలు జరిగాయి. 1954-55కు ముందుగానీ, ఆ తర్వాత కానీ.. 2020-21 అన్లైన్ పహాణీ వరకు అన్ని రెవెన్యూ పహాణీల్లోనూ 437 సర్వే నెంబర్ పూర్తిగా పట్టా భూమి. దివాన్ కమిటీ నివేదికలో కూడా పేర్కొన్న సర్వే నంబర్లలోనూ 437 లేనేలేదు. ఎండోమెంట్ భూమి కానేకాదు. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఈ సర్వే నంబర్ ఎండోమెంట్ జాబితాలో లేనే లేదు. లేదని చెప్పింది వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం. దేవరయాంజాల్లో ఎండోమెంట్ భూములకు సంబంధించి 14.10.2004న వైఎస్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 810 జారీ చేసింది. అక్కడ ఏవి ఎండోమెంటో భూములో, పాత – కొత్త సర్వే నంబర్ల వారీగా, భూ విస్తీర్ణం ఎంత ఉన్నదో పేర్కొంటూ ఒక నోటిఫికేషన్ను విడుదల చేసింది.
దేవరయాంజాల్లోని ఎండోమెంటు ప్రొహిబిటెడ్ భూములపై 14.10.2004న
వైఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంస్ నంబరు 810. ఈ సర్వే నంబర్లలో 437 లేదు.
ఫలానా సర్వే నంబర్లలోని భూములపై క్రయవిక్రయాలు జరపకూడదంటూ నిషిద్ధ భూముల జాబితాను కూడా సర్వే నంబర్ల వారీగా ప్రకటించింది. వైఎస్ ప్రభుత్వం ప్రకటించిన నిషిద్ధ సర్వే నంబర్లలో, పాతవాటిలోగానీ, కొత్త వాటిలో గానీ, 437 సర్వే నంబర్ ఎక్కడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న రేవంత్రెడ్డి, మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో తప్పంటున్నాడా? అది నాలుకా, తాటిమట్టా? మెదడులో గుజ్జుంటే జవాబు చెప్పాలి. లేక పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు, రేవంత్రెడ్డి ఎదుటివాళ్లంతా కబ్జాకోరులుగా కనిపిస్తున్నారా? అందరూ తనలాగే ఉంటారనుకుంటున్నారా? ఏ ఆధారం లేకున్నా అవి దేవాదాయ భూములనడానికి, చర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు అంజనం విద్య ఏమైనా నేర్చుకున్నాడా? ఇక అక్కడ ప్రింటింగ్ ప్రెస్సు షెడ్డు 50 అడుగులున్నదని కూడా రేవంత్ కళ్లతోనే కొలిచి చెప్పాడు. వారెవ్వా ఎంత టాలెంట్! ఏ ఆధారాలు లేకుండా ఆవాకులు పేలటం రేవంత్కే చెల్లింది.
దేవరయాంజాల్లో రాకాసులెవరో, గోకాసులెవరో కమిటీ కచ్చితంగా తేలుస్తుంది. రాముడి భూమిని కబ్జా పెట్టిన రాక్షసులెవరో తప్పకుండ బయటపెడుతుంది. రేవంత్ ఉలికిపాటుకు కారణం అదే కావచ్చు. ఏదో గూడుపుఠాణీ ఉంది. చీకటి ఒప్పందాలు, అక్రమ సంబంధాలు ఏవో ఉన్నాయి. అందుకే రేవంత్ కలవరపడుతున్నారు. ఏ ఆధారమూ లేకుండా కెమెరా సాక్షిగా, అవాకులు చెవాకులు పేలుతున్నారు. తానొక వేలు చూపిస్తే, నాలుగువేళ్లు తనవైపే చూపిస్తున్నాయన్న వాస్తవాన్ని రేవంత్రెడ్డి మరిచిపోతున్నారు. తాను బురదలో పొర్లుతూ, దాన్ని ఇతరులకు అంటించాలని ప్రయత్నిస్తున్నారు. దమ్ముంటే, ధైర్యముంటే నమస్తే తెలంగాణ భూములు దేవాదాయశాఖ భూములని రేవంత్ నిరూపించాలి. ఆ ఆధారాలను విచారణ కమిటీకి సమర్పించాలి. లేదంటే దేవరయాంజాల్ సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాముడి ముందు ముక్కు నేలకు రాసి, చెంపలేసుకోవాలి. సిగ్గూ శరం మంచి మర్యాద ఉంటే రాజకీయాల నుంచి విరమించుకోవాలి. ఇలాంటి నిరాధార ఆరోపణలు మానుకోకపోతే… పరువు నష్టం దావా వెయ్యడానికైనా వెనుకాడబోమని టీపీపీఎల్ యాజమాన్యం రేవంత్రెడ్డిని హెచ్చరిస్తున్నది.
దమ్ముంటే రుజువు చెయ్యాలి
దేవరయాంజాల్లోని నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్కు సంబంధించి భూ వ్యవహారాలన్నీ పూర్తి పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగాయి. వాటికి సంబంధించిన పత్రాలన్నీ పకడ్బందీగా ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ దేవరయాంజాల్లోని దేవాదాయ భూములన్నింటిపైనా విచారణ జరపమని ఆదేశించారు తప్ప, కొన్నింటిని మినహాయించాల్సిందిగా ఎక్కడా చెప్పలేదు. మొత్తం కొలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సర్వే జరుగుతున్నది. తప్పు చేసిన వాళ్లకు కమిటీ కచ్చితంగా నోటీసులు ఇస్తుంది. అంతలోనే రేవంత్కు ఆగమెందుకు? గాయిగాయి గత్తరెందుకు? ఒకవేళ నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ భూములపై ఎవరికైనా అనుమానాలు ఉంటే, ప్రభుత్వం నియమించిన నలుగురు ఐఏఎస్ల కమిటీకి నిరభ్యంతరంగా ఫిర్యాదు చేసుకోవచ్చు. కమిటీ దీనిపై పూర్తి స్థాయిలో ఎలాంటి విచారణనైనా చేసుకోవచ్చు. ఇందుకు టీపీపీఎల్ యాజమాన్యం పూర్తిగా సహకరిస్తుంది. భూమి విషయంలో అక్రమాలు ఏవైనా ఉన్నాయని రుజువైతే ప్రభుత్వం నిర్దంద్వంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అవి దేవాదాయ శాఖ భూములని తేలితే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, వాటిని పేద ప్రజలకు పంచిపెట్టవచ్చు. మరి లేదని తేలితే!
గురువారం దేవరయాంజాల్లోని నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ వద్ద రేవంత్ రెడ్డి వ్యాఖ్య
మొదట చూసినవి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ప్రింటింగ్ కార్యాలయాలు. మనకు దొరికింది మూడు నాలుగు ఎకరాల మేరకు ఉన్న డాక్యుమెంట్. కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు దాదాపు పది నుంచి పదిహేను ఎకరాల మేర ఉన్నది. దాదాపు 45 నుంచి 50 అడుగుల ఎత్తున గోడతో, వారి గోడౌన్లు, ప్రింటింగ్ యూనిట్లు ఉన్నాయి. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే.. 437 సర్వే నంబర్లో ఎవరు అనుమతినిచ్చిన్రు.. జీహెచ్ఎంసీ ఇచ్చిందా? తూం కుంట మున్సిపాలిటీ ఇచ్చిందా? అంతకుముందు గ్రామపంచాయితీ ఇచ్చిందా? ఈ అనుమతులన్నీ ఎక్కడినుంచి వచ్చినయో చర్చ జరగాలి.
మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ వద్ద ఉన్న నమస్తే తెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ నిర్మాణం కోసం దేవరయాంజాల్లో టీపీపీఎల్ మూడు దఫాలుగా భూమిని కొనుగోలు చేసింది. పూర్తి వివరాలివీ..
ప్రింటింగ్ ప్రెస్ నిర్మాణానికి దేవరయాంజాల్ గ్రామ పంచాయతీ నుంచి 14.03.2011 తీసుకున్న అనుమతి పత్రం.
దేవరయాంజాల్లో ప్రింటింగ్ ప్రెస్ నిర్మాణానికి అనుమతిస్తూ 2012 మార్చిలో
ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇచ్చిన ప్రొసీడింగ్స్