చిట్యాల, జూలై 30: పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అధికారులను బ్లాక్ మెయిల్ చేసేలా ఉన్నాయని, హూందాతనాన్ని మరిచి బూతులు మాట్లాడుతున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చిట్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజమని, కానీ అవి హూందాగా ఉండాలని సూచించారు. రైతు బంధు పథకం వచ్చినప్పుడు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని, ఇప్పుడు దళిత బంధుపైనా కాంగ్రెస్, బీజేపీలు అక్కసును వెళ్లగక్కుతున్నాయని మండిపడ్డారు. దళితబంధు ఉప ఎన్నికల కోసం తీసుకొచ్చిన పథకం కాదని, గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం పొందిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో మైకు లాక్కొని అడ్డుతగలడం సరికాదన్నారు.