ఇబ్రహీంపట్నం, మే 25 : కరోనా కష్టకాలంలో నిరుపేదలు, రోజువారీ కూలీలకు అండగా నిలుస్తామని ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డీఎం బాబునాయక్ అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో రోజువారీ కూలీలు, పాదచారులకు మధ్యాహ్న భోజనం ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా బాబునాయక్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు బస్సులు కొనసాగుతున్నందున ప్రయాణికులు ప్రైవేటు వాహనాల్లో ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా భౌతికదూరం పాటిస్తూ ప్రయాణం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సరస్వతి, అసిస్టెంట్ ఇంజినీర్ సత్తయ్య పాల్గొన్నారు.
వలస కూలీలకు భోజనం ప్యాకెట్లు..
లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులెదుర్కొంటున్న మున్సిపల్ కార్మికులు, వలస కార్మికులతో పాటు రోజువారీ కూలీలకు భోజనం ప్యాకెట్లు అందజేశారు. నవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్న భోజనం ప్యాకెట్లతో పాటు ఎనర్జీ డ్రింక్స్ను ఫౌండేషన్ వ్యవస్థాపకులు మడుపు వేణుగోపాల్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ.. లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న కూలీలకు ఆహారం అందజేయడం ఆనందంగా ఉందన్నారు. మున్సిపల్ కార్మికుల సేవలు వెలకట్టలేనివన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రంజిత్, హర్షిత్, అభిషేక్, మధు, శ్రవణ్ పాల్గొన్నారు.