‘సక్సెస్కు ఫుల్స్టాప్లు ఉండవు. కామాలు మాత్రమే ఉంటాయి’ ఓ చిత్రంలోని డైలాగ్ ఇది. ఆ మాటలు ఇరవై ఏండ్ల హైదరాబాదీ అమ్మాయికి అతికినట్టు సరిపోతాయి. సక్సెస్ రాగానే సంతృప్తి పడలేదామె. నచ్చిన ఆటను వదులుకుంది. పదిమంది మెచ్చేవిధంగా కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వేలమందిని మారుస్తానంటున్నది. లక్షలమందిలో స్ఫూర్తి నింపుతానంటున్నది.బ్రిక్స్ సీసీఐ అంబాసిడర్గా ఎంపికై దేశదేశాల యువతకు మార్గనిర్దేశం చేస్తానంటున్న సృష్టి జర్నీ ఇది..
హైదరాబాద్కు చెందిన వ్యాపారి రాజా జుపూడి, మాధురి జుపూడి దంపతులకు ఇద్దరు పిల్లలు. తల్లి మాధురి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. పలు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడమే గాకుండా దేశానికి అనేక పోటీల్లో ప్రాతినిధ్యం వహించారు. ఆమె వారసత్వాన్ని చిన్న కుమార్తె సృష్టి పుణికి పుచ్చుకున్నది. ఎనిమిదేండ్లకే బ్యాడ్మింటన్ కోర్టులోకి అడుగుపెట్టింది. అంతర్జాతీయ క్రీడాకారుడు, ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ పుల్లెల గోపీచంద్ శిక్షణలో మరింత రాటుదేలింది. 2011లో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ విజేతగా నిలువడంతో వెలుగులోకి వచ్చింది. తర్వాత అంకితభావంతో రోజుకు 8 నుంచి 12 గంటలపాటు కఠోర శ్రమ చేస్తూ అనతికాలంలోనే ఉన్నత స్థాయికి ఎదిగింది. అవార్డులను సొంతం చేసుకుంది. ప్రపంచస్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా రాణించింది. రెండుసార్లు అంతర్జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించి తెలంగాణ కీర్తి పతాకను ఎగురవేసింది.
అరుదైన లక్ష్యం కోసం..
ఆటల్లో ఆరితేరిన సృష్టి చదువుల్లోనూ సత్తా చాటుతున్నది. గీతంలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నది. తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించింది. ఈ క్రీడలో అరుదైన ఘనతనూ సొంతం చేసుకుంది. మాల్కం గ్లాడ్వెల్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎవరైనా సరే 10వేల గంటలకు పైగా ఏదైనా ఒక రంగంలో కృషి చేసిన వారు అందులో అత్యంత నిష్ణాతులుగా గుర్తింపును పొందినట్లు లెక్క. ప్రపంచ స్థాయి నైపుణ్యాలను సాధించారని చెప్పడానికి మాల్కం గ్లాడ్వెల్ అనేదే గీటురాయి. దానిని సాధించిన జూనియర్ బ్యాడ్మింటన్ ప్లేయర్గా సృష్టి పేరు సాధించింది. అయితే, బ్యాడ్మింటన్లో ఇంత పట్టు సాధించిన ఆమె క్రీడల్లో ఉజ్వలమైన భవిష్యత్తును వద్దనుకుంది. యువతలో స్ఫూర్తిని నింపాలనే లక్ష్యంతో ఆటకు స్వస్తి పలికింది.
బ్రిక్స్ అంబాసిడర్గా..
ఆటలు, చదువుతోపాటు సమాజసేవలోనూ ముందుంటున్నది సృష్టి. ఇప్పటికే హాబిటేట్ హ్యుమానిటీ అనే అంతర్జాతీయ ఎన్జీవో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొంటున్నది. ఆ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నది. యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నది. ఆ ఎన్జీవోకు సంబంధించి భారత రాయబారులుగా ప్రముఖ నటులు జాన్ అబ్రహాం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఉండటం గమనార్హం. ఆ అనుభవంతో యువతలో స్ఫూర్తి నింపాలని నిశ్చయించుకున్నదామె. ఆమె ఆశయ సాధనకు గొప్ప వేదిక దొరికింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు ఆదర్శంగా నిలిచే అవకాశాన్ని సొంతం చేసుకుంది. బ్రిక్స్ సీసీఐ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికై అరుదైన అవకాశాన్ని అందుకుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు తమ మధ్య వర్తక వాణిజ్యాల అభివృద్ధి, పరిశ్రమల ఏర్పాటులో పరస్పర సహకారం కోసం ఏర్పాటు చేసుకున్న కూటమే బ్రిక్స్. దాని మాతృ సంస్థే సీసీఐ (చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్). ఇది ప్రధానంగా బ్రిక్స్ సభ్యదేశాల్లోని యువతను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుంటుంది. ఈ సంస్థ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికైంది సృష్టి. లక్షలాది మంది యువతకు మార్గనిర్దేశనం చేయడానికి సన్నద్ధం అవుతున్నది. 2021 నుంచి 2023లోగా కనీసం 10 లక్షల మంది యువతీ యువకుల్లో స్ఫూర్తిని రగిల్చడానికి సన్నద్ధం అవుతున్నది ఈ యువతేజం.
నా అనుభవాలే పాఠాలు
ప్రస్తుతం యువ జనాభా అధికంగా ఉన్న దేశాల్లో భారత్ టాప్. కానీ, మన దేశ యువత అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రపంచస్థాయి పోటీని తట్టుకోలేక ఒత్తిడికి గురవుతున్నారు. నా పదేండ్ల క్రీడాజీవితంలో నేనూ ఎన్నోసార్లు ఒత్తిడికి గురయ్యాను. ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నా. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం, ఒత్తిడిని జయించలేకపోవడం వంటివి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అందరికీ తెలుసు. నేను నేర్చుకున్న అంశాలనే యువతతో పంచుకోవాలని నిర్ణయించుకున్నా, మరీ ముఖ్యంగా మహిళలతో! వారిలో నాయకత్వ లక్షణాలతను పెంపొందించడంతోపాటు స్వశక్తితో ఎదిగేలా ప్రోత్సహించడమే నా లక్ష్యం. సీసీఐ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికవడం నా ఆశయానికి లభించిన గొప్ప అవకాశం.
సృష్టి, బ్రిక్స్
సీసీఐ బ్రాండ్ అంబాసిడర్
సృష్టి తన ఆటతో అనేక అవార్డులను సొంతం చేసుకుంది. కెరీర్కు స్వస్తి పలికే నాటికి సృష్టి ఆలిండియా బ్యాడ్మింటన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో మొదటి ర్యాంకులో, అండర్ 19 ఉమెన్స్ విభాగంలో 3వ ర్యాంకులో కొనసాగుతుండటం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో జూనియర్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో 74వ ర్యాంకులో కొనసాగుతున్నది.
-మ్యాకం రవికుమార్