న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు విచారణలు లైవ్ టెలికాస్ట్ చేసేందుకు అనుమతించే ప్రతిపాదనను చురుకుగా పరిశీలిస్తున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. సుప్రీంకోర్టు వర్చువల్ విధానంలో జరిపే విచారణలను మీడియాకు అందుబాటులోకి తెచ్చే అప్లికేషన్ను గురువారం విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, లైవ్ విషయమై నిర్ణయం తీసుకునే ముందుగా తన సహచరుల అభిప్రాయాలు తెలుసుకుంటానని జస్టిస్ రమణ చెప్పారు. తానూ ఒకప్పుడు జర్నలిస్టునేనని గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టులు కోర్టు విచారణల వార్తల కోసం న్యాయవాదులపైన ఆధారపడాల్సి వస్తున్నదని చెప్పారు. అందుకే విచారణలకు జర్నలిస్టులను అనుమతించాలనే ప్రతిపాదన వచ్చిందని అన్నారు. “నేనూ కొంతకాలం జర్నలిస్టుగా పనిచేశాను. అప్పట్లో కార్లు, బైకులు లేవు. నిర్వాహకులు సమకూర్చే వాహనాల్లో వెళ్లొద్దని పైనుంచి ఆదేశాలుండేవి. అందువల్ల మేం బస్సుల్లోనే వెళ్లేవాళ్లం” అని చీఫ్ జస్టిస్ చెప్పారు. ఈ రోజు విడుదల చేసిన రిసోర్స్ యాప్ను బాధ్యాతయుతంగా వినియోగించాలని మీడియాకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొత్తగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ సున్నితమైనదని, తొలినాళ్ల ఉపయోగంలో కొన్ని సమస్యలూ ఉండొచ్చని చెప్పారు. చిన్నచిన్న సమస్యలు వస్తే భూతద్దంలో చూపొద్దని, సాంకేతిక బృందానికి సహకరించాలని సూచించారు.