హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): కొద్ది రోజులుగా పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నది. వరుసగా వస్తున్న పండుగల నిర్వహణపై ఆంక్షలు విధిస్తూ సీఎస్ సోమేశ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. షబ్-ఏ- బరాత్, హోలీ, ఉగాది, శ్రీరామ నవమి, మహవీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, రంజాన్ పండుగలపై ఆంక్షలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పండుగల వేళ బహిరంగ ప్రదేశాల్లో ప్రార్థనలు, వేడుకలు, ర్యాలీలు నిర్వహించడం, పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడటాన్ని నిషేధిస్తున్నట్టు స్పష్టంచేశారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 30వ తేదీ వరకు అమలులో ఉంటాయని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను, పోలీసులను ఆదేశించారు.
మాస్క్ తప్పనిసరి
బహిరంగ, పని ప్రదేశాల్లో, ప్రయాణాల్లో మాస్క్ ధరించడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ మేరకు సీఎస్ మరో ఉత్తర్వు జారీచేశారు. కరోనా కట్టడిలో మాస్క్ ధరించడం ముఖ్యమైన రక్షణ చర్య అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటికి వెళ్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. లేనిపక్షంలో విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైరస్ సెకండ్ వేవ్ మొదలైందని చెప్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో భారీగా కేసులు నమోదు అవుతుండటంతో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో కూడా క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు వరుసగా పండుగలు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే పండుగల నేపథ్యంలో కరోనా వ్యాప్తిపెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరోసారి వైరస్ విజృంభించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పండుగల సందర్భంగా ప్రజలు గుమిగూడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పండుగలపై ఆంక్షలు విధించింది. ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలు పాటించాలని, పండుగల వేళ ప్రార్థనలు, వేడుకలకు దూరంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
హోలీ వేడుకలపై పోలీసుల దృష్టి
కరోనా కేసులు పెరుగుతుండటంతో హోలీ వేడుకలపై పోలీసులు దృష్టిసారించారు. కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో హోలీ వేడుకలపై ముగ్గురు పోలీసు కమిషనర్లు వేర్వేరుగా ఆదేశాలు జారీచేశారు. హోలీ పేరిట రోడ్లపైకి వచ్చి సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దని, రంగునీళ్లు, రంగులు ఇష్టంలేకుండా ఇతరులపై చల్లవద్దని ఆ ఆదేశాల్లో సూచించారు. ఈ ఆంక్షలు ఆదివారం సాయంత్రం 6 నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉండనున్నాయి. ఇదే సమయంలో వైన్స్లు, బార్లు, రెస్టారెంట్లు మూసి ఉంటాయని కమిషనర్లు స్పష్టంచేశారు. అన్ని జిల్లాల పరిధిలో కలెక్టర్లు, యూనిట్ పోలీస్ అధికారులు ఆదేశాలు జారీచేశారు.