డొడోమా: టాంజానియా అధ్యక్షుడు జాన్ మగుఫులి మృతిచెందారు. ఆయన వయసు 61 ఏళ్లు. అధ్యక్షుడు జాన్ మరణించినట్లు ఉపాధ్యక్షుడు హసన్ ఓ ప్రకటనలో తెలిపారు. దరసలామ్లో ఉన్న హాస్పిటల్లో.. గుండె సంబంధిత వ్యాధి వల్ల అధ్యక్షుడు జాన్ మృతిచెందినట్లు తెలిపారు. గత రెండు వారాల నుంచి మగుఫులి ప్రజాజీవితంలో లేరు. అయితే ఆరోగ్యం సరిగా లేని కారణంగా ఆయన బయటకు రావడం లేదని తెలుస్తోంది. కరోనా వైరస్ వల్ల ఆయన మృతిచెందిన ఉంటారని భావిస్తున్నారు. అధ్యక్షుడు జాన్కు కరోనా సంక్రమించినట్లు గత వారం ప్రతిపక్షాలు ఆరోపించాయి. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ విషయాన్ని ద్రువీకరించలేదు. దేశంలో 14 రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నారు. టాంజానియా రాజ్యాంగం ప్రకారం ఉపాధ్యక్షుడు హసన్.. దేశాధ్యక్ష బాధ్యతలు చేపడుతారు. గత ఏడాది మగుఫులి దేశాధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 27వ తేదీన చివరిసారి మగుఫులి పబ్లిక్గా కనిపించారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు. ఆయన ఆరోగ్యంపై విమర్శలు వెల్లువెత్తాయి. అధ్యక్షుడు జాన్కు కరోనా సంక్రమించిందని, ఆయన కెన్యాలో చికిత్స పొందుతున్నట్లు ఇటీవల ప్రతిపక్ష నేత టుండు లిస్సు ఆరోపించారు.
కరోనా వైరస్ అంటూ ఏదీ లేదని గత ఏడాది అధ్యక్షుడు జాన్ మగుఫులి ప్రకటించారు. గత ఏడాది జూన్లోనే ఆయన దేశాన్ని కోవిడ్ ఫ్రీగా ప్రకటించారు. మాస్క్లతో ఏమీ ప్రయోజనం లేదన్నారు. టెస్టింగ్ ప్రక్రియలను కూడా అనుమానించారు. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న పొరుగుదేశాలను జాన్ తప్పుపట్టారు. సాంప్రదాయ చికిత్స పొందుతే సరిపోతుందని అన్నారు. దేశంలో నమోదు అవుతున్న కరోనా కేసుల సంఖ్యను గత మే నెల నుంచి టాంజానియా ప్రకటించడం లేదు. వ్యాక్సిన్లు కొనేందుకు కూడా ఆ దేశం నిరాకరించింది. అయితే అధ్యక్షుడు జాన్ ఆరోగ్యంపై వదంతులు వ్యాపింపచేస్తున్న నలుగుర్ని అరెస్టు చేశారు.