బీజేపీకి డిపాజిట్ కూడా రాదు
జానారెడ్డిని 2018లోనే తిరస్కరించారు
సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్దే గెలుపు
మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్
హాలియా, ఏప్రిల్ 2: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలే బుద్ధి చెబుతారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. హాలియాలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కడారి అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 5 వేల మంది బీజేపీ కార్యకర్తలు శుక్రవారం మంత్రులు జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షం లో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. ఏడేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో దూసుకుపోతుంటే.. కేంద్ర ప్రభుత్వం పన్నుల భారం మోపి పేదల నడ్డి విరుస్తున్నదని మండిపడ్డారు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదన్నారు. కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని నడపడం తన చేతకాదని రాహుల్గాంధీ ఎప్పుడో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. వరుస ఓటములతో కంగుతిన్న ఎంపీ ఉత్తమ్కుమార్ రెడ్డి సైతం పీసీసీ పదవికి రాజీనామా చేశారని చెప్పారు. 2018 లోనే జానారెడ్డిని ఇక్కడి ప్రజలు తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు.
జానారెడ్డి ఓటమి తథ్యం : మంత్రి తలసాని
సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి తథ్యమని మంత్రి తలసాని అన్నారు. ఏ పార్టీ నాయకులూ ప్రచారం నిర్వహించవద్దని చెప్పిన ఆయన వెన్ను చూపారని విమర్శించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న జానారెడ్డి.. భగత్ను కుమారుడిగా భావించి పోటీ నుంచి తప్పుకుంటే బాగుండేదన్నారు. యువకుడు, విద్యావంతుడైన నోముల భగత్ ఎన్నికల ప్రచారంలో పరుగెడుతుంటే.. జానారెడ్డి నడువలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్, నోముల నర్సింహయ్య సతీమణి లక్ష్మి పాల్గొన్నారు.
మీ బిడ్డలా సేవ చేస్తా : నోముల భగత్
తన తండ్రి ఇచ్చిన హామీలను నెరవేర్చడంతోపాటు సాగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని, బిడ్డలా సేవ చేసుకునే అవకాశం కల్పించాలని టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల భగత్ కోరారు. త్రిపురారం, గుర్రంపోడు మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన ప్రచారాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, జరుగబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాలను మీ ముంగిటకు తీసుకొస్తా’నని పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, శంకర్నాయక్, కిశోర్కుమార్, కంచర్ల భూపాల్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డి పాల్గొన్నారు.
జోరుగా టీఆర్ఎస్లో చేరికలు..
త్రిపురారం మండలంలోని డొంకతండా, రూప్లాతండా, లోక్యాతండా, బొర్రాయిపాలెం గ్రామాల్లో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే శంకర్నాయక్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మాడ్గులపల్లి మండలం గ్యారకుంటపాలెంలో ఆర్మూర్, భువనగిరి ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి సమక్షంలో ధర్మాపురం, అభంగాపురం, గ్యారకుంటపాలెం గ్రామాలకు చెందిన 50 కుటుంబాల వారు బీజేపీని వీడి టీఆర్ఎస్లో చేరారు. అనుముల మండలం రామడుగులో 30 మంది కాంగ్రెస్ కార్యకర్తలు సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమక్షంలో, తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్లో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ సమక్షంలో 20 కుటుంబాల వారు, నందికొండలోని పైలాన్కాలనీలో సుమారు 200 మంది కరీంనగర్ సుడా చైర్మన్ రామకృష్ణారావు సమక్షంలో టీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు.
రైతు బాగును కోరుకునేది టీఆర్ఎస్సే: పల్లా
త్రిపురారం, ఏప్రిల్ 2: రైతు బాగుండాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ తరఫున శుక్రవారం త్రిపురారం మండలంలో ప్రచారం నిర్వహించారు. బొర్రాయిపాలెంలో పల్లా మాట్లాడుతూ.. ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం, రూ.5 లక్షల బీమా ఇస్తున్నది ఒక్క తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్, సబ్సిడీపై ట్రాక్టర్లు, పరికరాలు అందిస్తున్నట్టు తెలిపారు. కారు గుర్తుపై ఓటేసి భగత్ను గెలిపించాలని పల్లా కోరారు.
తండాలను మార్చిన ఘనత కేసీఆర్దే : పోచంపల్లి
తండాలను పంచాయతీలుగా చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని వరంగల్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నా రు. త్రిపురారం మండలంలోని బడాయిగడ్డ, డొంకతండా, రూప్లాతండా, అప్పలమ్మగూడెం, బొర్రాయిపాలెం గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయ న మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం 500 జనాభా ఉన్న ప్రతి తండాను పంచాయతీగా మార్చి అభివృద్ధికి నాంది పలికిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి రూ.20 లక్షల బడ్జెట్ కేటాయించి రాష్ర్టాన్ని ముందుకు తీసుకుపోయే దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఇంటింటికీ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. సకల సౌకర్యాలు ప్రతి ఇంటికీ చేరాలంటే సాగర్ ఉప ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి భగత్ను గెలిపించాలని కోరారు. అప్పలమ్మగూడెంలో ఇటీవల మరణించిన మస్తాన్, సావిత్రమ్మ కుటుంబాలకు రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
స్టడీ మెటీరియల్ కోసం వెళ్తూ..
భారం కావొద్దని.. వృద్ధ దంపతులు
ఆడుకొనేందుకు వెళ్లి అగ్నికి ఆహుతి
అన్నప్రాసనకు వెళ్తూ.. అనంతలోకాలకు
పుచ్చకాయ తిని అన్నదమ్ములు మృతి
కేసీఆర్ ఆపద్బంధు బీసీల బంధువు
స్కౌట్స్, గైడ్స్ చీఫ్ కమిషనర్గా ఎమ్మెల్సీ కవిత
రూ.8.4 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం